‘ముద్దిస్తేనే.. ఉద్యోగం!, నాతో గడిపితే..’: మహిళకు ఉన్నతాధికారి లైంగిక వేధింపులు
నెల్లూరు : నెల్లూరు తాలూకా కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు కార్యాలయంలోని ఓ మహిళా ఉద్యోగిని తన ఉన్నతాధికారి నుంచి వస్తున్న లైంగిక వేధింపులు భరించలేక కలెక్టర్ను ఆశ్రయించింది. ఆమెకు పదే పదే ఫోన్ చేస్తూ.. ‘నీ పదోన్నతి కోసం సీఆర్పై సంతకం చేశాను. నాకు మనసారా ముద్దు ఇవ్వవా' అంటూ ఉన్నతాధికారి వేధింపులకు గురిచేశాడని ఆమె ఫిర్యాదు చేసింది.
అంతేగాక, తన కోరిక తీర్చకపోతే ఆఫీసుకు వచ్చినా సెలవుగానే ఉంటుందని, భర్త కూడా లేని నీవు నాతో గడిపితే ఉద్యోగం అవసరం కూడా ఉండదని ఉన్నతాధికారి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఇక ఉద్యోగం చేయలేనని, అతనిపై చర్యలు తీసుకోకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని కలెక్టర్ ముందు తన ఆవేదనని వెలిబుచ్చారు బాధిత మహిళా వ్యవసాయాధికారి.
ఈ మేరకు కలెక్టర్ ఎం. జానకికి శనివారం ఆమె ఫిర్యాదు చేశారు. భూసార పరీక్షల కేంద్రం ఏడీఏ తనను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని లిఖిత పూర్వకంగా తెలిపారు. నెల్లూరు తాలూకా కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భూసార పరీక్షల కేంద్రంలో వ్యవసాయాధికారణిగా పని చేస్తున్న మహిళ ఇప్పటి వరకు అధికారులకు నేరుగా ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు అధికారిపై ఉన్నతాధికారులు హెచ్చరికలతో సరిపెట్టారు.
కాగా, అతడి వేధింపులు మితిమీరడంతో బాధితురాలు లిఖితపూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలు ఆరోపణలు మూటకట్టుకున్న సదరు అధికారి ఏడీఏ కేడర్ నుంచి ఏవో డిమోషన్ అయ్యారు. 2015 నవంబరు నుంచి తనను టార్గెట్ చేసిన ఏడీఏ ప్రతిరోజూ వేధిస్తున్నాడంటూ బాధితురా లు వాపోయారు.
ప్రమోషన్ సీఆర్పై సంతకం చేసినందుకు ముద్దివ్వాలని, భర్త లేనందున తనకు లొంగాలని, బెదిరింపులకు దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 11, 12 తోటి ఉద్యోగినులు రాకపోయినా, సెలవు ప్రకటించినా ఏడీఏ తనచేత బలవంతంగా సెలవు పెట్టిం చాడని వివరించారు. ఇప్పటికే అతడి వేధింపులపై జేడీ, ఉద్యోగ సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.