డబ్బులు పోతే పోయే- అక్కడ ఉండలేను బాబోయ్: రూ. 27 కోట్ల నుంచి పంత్ ఫాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మకమైన భారీ ట్రేడ్ డీల్ పూర్తయింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ తన పాత గూటికి విచ్చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి వైదొలిగాడు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ లో అతను తిరిగి ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడబోతోన్నాడు. దీనికి సంబంధించిన డీల్ ముగిసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా వెల్లడించింది. రిషభ్ పంత్ తాజా ప్యాకేజీ ధరనూ ప్రకటించింది.
అదే సమయంలో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఢిల్లీ కేపిటల్స్ ను వీడాడు. లక్నో సూపర్ జెయింట్స్ కు బదిలీ అయ్యాడు. ఈ ట్రేడ్ డీల్లో భాగంగా రిషబ్ పంత్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఏకంగా 27 కోట్ల రూపాయల రికార్డు స్థాయి ధరను వెచ్చించి పంత్ను దక్కించుకుంది. లక్నో కెప్టెన్గా ఈ ఒక్క సీజన్ మాత్రమే ఆడిన పంత్.. నిరాశపరిచాడు. దీంతో జట్టును వీడటానికే ప్రాధాన్యత ఇచ్చాడు.

తాను సుదీర్ఘ కాలం పాటు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి అడుగుపెట్టేందుకు పంత్ ఏకంగా 12 కోట్ల రూపాయల నష్టాన్ని భరించడానికి సిద్ధపడ్డాడు. లక్నోలో ఉన్న రూ. 27 కోట్ల భారీ పారితోషికాన్ని వదులుకుని, ఇప్పుడు రూ. 15 కోట్ల కాంట్రాక్ట్ మొత్తానికే ఢిల్లీ కేపిటల్స్ జట్టుతో మళ్లీ చేతులు కలిపాడు. ఆటగాళ్లు డబ్బు కంటే సొంత ఫ్రాంచైజీతో ఉన్న అనుబంధానికే ప్రాధాన్యత ఇస్తారనేది విషయాన్ని పంత్ నిరూపించినట్టయింది.
రిషబ్ పంత్ తన ఐపీఎల్ కెరీర్లో ఎక్కువ మ్యాచ్ లు ఢిల్లీ కేపిటల్స్కే ఆడాడు. అతనికి భావోద్వేగమైన అనుబంధం ఉందీ ఫ్రాంఛైజీతో. 2016 నుండి 2024 వరకు దాదాపు తొమ్మిది ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీకి ప్రాతినిథ్యాన్ని వహించాడు. ఆ జట్టు తరఫున అత్యధికంగా 111 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడిగా పంత్ నిలిచాడు. అంతేకాకుండా, నాలుగు సీజన్ల పాటు 43 మ్యాచ్లలో జట్టును విజయవంతంగా నడిపించి ఒక ప్రత్యేక ముద్ర వేశాడు.
పంత్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని వికెట్ కీపింగ్ సమస్యలు తీరడంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారనుంది. అతని పునరాగమనం ఢిల్లీ జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ తాజా విండో మార్పు కారణంగా రాబోయే ఐపీఎల్ టోర్నమెంట్లో ఢిల్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తోంది.
మరోవైపు.. టీమిండియా టాప్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇకపై లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మైదానంలోకి దిగనున్నాడు. గత అయిదు సీజన్లుగా ఢిల్లీ కేపిటల్స్ కొనసాగాడు. జట్టులో కీలక బౌలర్గా రాణించాడు. 2022లో ఈ ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అతను ఆడిన 65 మ్యాచ్లలో 72 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా కుల్దీప్ యాదవ్ ప్యాకేజీలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. రూ. 13.50 కోట్ల పారితోషికంతోనే లక్నో ఫ్రాంచైజీలో చేరబోతున్నాడు.












Click it and Unblock the Notifications