3 ఏళ్ళలోనే 35 కిలోల బరువు: ఆపరేషన్తో 13 కిలోల తగ్గుదల
విజయవాడ: మూడేళ్ళ ప్రాయంలోనే 35 కిలోల బరువుతో ఇబ్బందిపడుతున్న అలియా పర్వీన్ అనే చిన్నారికి విజయవాడలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు కొంగర రవికాంత్ విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాలిక వయస్సు 22 కిలోలకు చేరుకొంది. సుమారు 13 కిలోలు తగ్గింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని గోమ్యా గ్రామానికి చెందిన మహ్మద్ సలీం, షబ్నం పర్వీన్ దంపతులు టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడో సంతానంగా అలియా పర్వీన్ పుట్టింది. పుట్టిన సమయంలోనే ఆ బాలిక బరువు 3.5 కిలోలు ఉంది.
లెఫ్టిన్ రిసెప్టర్ డెఫీషియెన్సీ అనే లోపం కారణంగా ఆలియా మూడేళ్ళలోనే 35 కిలోల బరువు పెరిగింది. అధిక బరువుతో కనీసం కూర్చోలేని పరిస్థితికి ఆ బాలిక చేరుకొంది. జన్యుపరమైన లోపంతో ఆమె అధిక బరువుకు గురైందని ఆమెకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ రవికాంత్ ప్రకటించారు.
అధిక బరువుతో మూడేళ్ళ బాలికకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర సమస్యలు ఆ బాలికను చుట్టుముట్టాయి. ఆలియా తల్లిదండ్రులు ఆ బాలికను విజయవాడకు తీసుకొచ్చి డాక్టర్ రవికాంత్కు చూపించారు.
ఫర్వీన్కు ఉచితంగా గత ఏడాది నవంబర్లో బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించినట్టు డాక్టర్ రవికాంత్ చెప్పారు. ఈ మేరకు డాక్టర్ రవికాంత్ మీడియా ఆ బాలికకు వచ్చిన వ్యాధి, శస్త్రచికిత్స చేసిన తీరును వివరించారు. ఆ బాలికకు అరుదైన చికిత్స చేసినట్టుగా డాక్టర్ రవికాంత్ చెప్పారు. ఈ శస్త్ర చికిత్స కారణంగా ఆ బాలిక సుమారు 13 కిలోల బరువు తగ్గింది.