చిచ్చురేపిన ఆస్తి వివాదం: తమ్ముడి ప్రాణం తీసింది(ఫొటోలు)
విశాఖపట్నం: ఆస్తికోసం అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదం చివరకు ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద ఘటన పూర్ణామార్కెట్లోని స్ప్రింగ్రోడ్డులో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఘటన కారణంగా స్థానిక మహిళలు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్కి చెందిన సత్యేందర్ సింగ్ సూరి, జస్వంత్ సూరి అనే దంపతులు తమ పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్ సూరి, ఆయన భార్య పిల్లలతో కలిసి నోవాటెల్ సమీపంలో గల ఓ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. వీరంతా స్ప్రింగ్రోడ్డులో గత కొన్నేళ్లుగా ఫ్యాన్సీ దుకాణాన్ని నడుపుతున్నారు.
ఇదిలా ఉండగా వీరి చిన్న కుమారుడు ఆనంద్సింగ్ సూరి అలీయాస్ సన్నీ(30) 2010లో బాబి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకొని ఉషోదయ కూడలిలో విడిగా నివసిస్తున్నారు. కాగా, ఇటీవల సత్యేందర్ సింగ్ తన స్థలాన్ని విక్రయించారు. దానిలోని వాటాతో పాటు ఆస్తిని పంచాలని సన్నీ రోజూ తన అన్న మహేంద్ర సింగ్ వద్దకు వచ్చి గొడవ పడుతుండేవాడు.

ఎప్పటిలాగే సోమవారం మధ్యాహ్నం 2.35 గంటల సమయంలో సన్నీ మద్యం తాగి తన అన్న దుకాణం వద్దకు వచ్చాడని, తనతో పాటుగా చిన్నపాటి చాకు కూడా తెచ్చి, అన్న మహేంద్రసింగ్తో వాగ్వాదానికి దిగాడని సమీప దుకాణదారులు తెలిపారు. అప్పటికే దుకాణాంలో ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సర్ధిచెప్పుతున్నా అన్నదమ్ములు పట్టించుకోకపోవడంతో వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది.
ఇంతలోనే సన్నీ తనతో పాటుగా తీసుకొచ్చిన చాకుతో మహేంద్రసింగ్పై దాడి చేశాడని కొందరు చెబుతుండగా.. ఆ కత్తిని మహేంద్రసింగ్ తీసుకొని తమ్ముడి మెడను కోశాడని మరికొందరు అంటున్నారు. దీంతో ఇది హత్యా? ఆత్మహత్యా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా సన్నీ విలవిలా కొట్టుకుంటూ దుకాణం మెట్ల పైనుంచి కిందకు పడిపోయి ప్రాణాలు విడిచాడని స్థానికులు చెబుతున్నారు.
కాగా, మహేంద్రసింగ్ తాను ఈ హత్య చేయలేదని, తమ్ముడే తన మెడను కోసుకున్నాడని చెబుతున్నాడు. కానీ, స్థానికులంతా అతన్ని చుట్టుముట్టి నిలదీయడంతో 'నేనే హత్య చేశా'నని అరుచుకుంటూ అప్పటికే అక్కడకు వచ్చిన మహారాణిపేట స్టేషన్ పోలీసులతో పాటుగా వెళ్లిపోయాడు.

ఆస్తికోసమే హత్య చేశాడు: సన్నీ భార్య
తన భర్తను బావగారైన మహేంద్రసింగ్ హత్యచేశాడని సన్నీ భార్య బాబి సూరి ఆరోపించారు. భర్త మృతదేహాన్ని చూసిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 2010లో తాము ప్రేమ వివాహం చేసుకొని, కుటుంబానికి దూరంగా నివసిస్తున్నామన్నారు. కుటుంబం నుంచి తనకు రావాల్సిన వాటా కోసం సన్నీ నిలదీస్తుండటంతో అంతా కలిసి పథకం ప్రకారమే హత్య చేశారని ఆమె ఆరోపించారు.
కావాలనే గొంతు కోసుకున్నాడు: సూరి తల్లిదండ్రులు
దుకాణం వద్ద పెద్దగా అరుస్తూ కొడుకులిద్దరూ వాగ్వివాదానికి దిగారని, చిన్న కొడుకు సన్నీ కావాలనే తనతో పాటుగా తీసుకువచ్చిన చాకుతో మెడను కోసుకున్నాడని తల్లి జస్వంత్సింగ్ చెప్పారు. తన వాటా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని గతంలో చాలాసార్లు బెదిరించేవాడన్నారు.
ఇది ఇలా ఉండగా, ఈ ఘటనపై హత్య కేసును నమోదు చేస్తున్నామని డీసీపీ రవికుమార్ మూర్తి తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన.. వివరాలు సేకరించామని, ప్రాథమిక సమాచారం మేరకు మహేంద్రసింగ్ సూరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించామని తెలిపారు. ఘటన స్థలంలో ఎలాంటి ఆయుధం దొరకలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications