సీన్ రివర్స్: మహిళా జడ్జిపై భర్త వేధింపుల ఫిర్యాదు, కేసు
హైదరాబాద్: సీన్ రివర్స్ అయింది. భర్తలు వేధిస్తున్నారంటూ మహిళలు ఫిర్యాదు చేయడం మామూలు. కానీ ఇక్కడ మహిళపై ఓ భర్త వేధింపుల ఫిర్యాదు చేశాడు. అతని భార్య సాధారణమైన మహిళ ఏమీ కాదు. న్యాయమూర్తి. తనను ఆమె చిత్రహింసలకు గురి చేస్తోందంటూ భర్త అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - హైదరాబాద్లోని మియాపూర్ కోర్టులో శ్రీదేవి అనే మహిళ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఈమెతో అనంతపురంలోని సాయి నగర్కు చెందిన జితేంద్రకు ఈ యేడాది మార్చి 7వ తేదీన వివాహమైంది. పెళ్ళయిన వారం రోజుల నుంచి తన భార్యతో మనస్పర్థలు మొదలయ్యాయని, గొడవలు భరించలేక తాను అనంతపురం కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు జితేంద్ర చెప్పారు.
ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం కోర్టు ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికెళ్లగా తనను బలవంతంగా ఈడ్చుకెళ్లి, తిడుతూ దాడి చేశారని, దెబ్బలకు తాళలేక తప్పించుకుని ఇంటి నుంచి నేరుగా ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నానని తెలిపారు. తనకు మెడ, ఛాతి, నుదుటి మీద దెబ్బలు తగిలాయని, తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని కోరారు. అంతేకాకుండా, తన భార్య నుంచి, ఆమె తల్లిదండ్రుల నుంచి తనకూ తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కె.జితేంద్ర అనంతపురం పోలీసులను కోరారు.
చైన్ స్నాచర్ హత్య
ఇదిలావుంటే, పహాడిషరీఫ్కు చెందిన చైన్స్నాచర్ మెంటల్ హాజి (35) సోమవారం రాత్రి చింతల్మెట్ బారా ఇమామ్ ప్రాంతంలోని గుట్టల్లో హత్యకు గురయ్యాడు. స్నేహితులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హాజిపై పహాడిషరీఫ్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనర్ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. ఇతడు పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరించేవాడని తెలిసింది.
పహాడిషరీఫ్కు చెందిన ఉస్మాన్, షఫీ, జుబేర్లు హాజి స్నేహితులు. వీరు కూడా ఇటీవల చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. వాటా ఇవ్వాలని, లేకుంటే పోలీసులకు సమాచారమిస్తానని హాజీ వారిని బెదిరించేవాడని తెలిసింది. దీంతో పథకం ప్రకారం ఉస్మాన్, షఫీ, జుబేర్లు సోమవారం రాత్రి చింతల్మెట్ బారా ఇమామ్ వెనుక గల గుట్టల్లోకి హాజిని పిలిచి రాడ్తో తలపై మోది హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.