‘చాక్పీస్ తాళి’ కడతా, టీసీ ఇచ్చి పంపిస్తా: విద్యార్థినులకు కీచక టీచర్ లైంగిక వేధింపులు
అమరావతి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. సమాజంలోని వ్యక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాననే విషయం మరిచి కీచకుడిగా మారాడు ఓ ప్రబద్ధుడు. కూతుళ్ల వయస్సున్న విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో వెలుగుచూసింది.
కూతురు వయస్సున్న విద్యార్థినులకు టీచర్ లైంగిక వేధింపులు
చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అబు (58)విద్యార్ధినుల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తూ..లైంగికంగా వేధించేవాడు. వారికి చిత్రహింసలు పెట్టాడు. తల్లిదండ్రులు, ఇతరులెవరికైనా ఈ విషయాన్ని చెబితే టీసీ ఇచ్చి పంపేస్తానని బెదిరింపులకు పాల్నడ్డాడు.
చాక్పీస్ తాళి కడతా.. టీసీ ఇచ్చి పంపిస్తా.. టీచర్ వేధింపులు
అంతేగాక, చాక్ పీసుకు ఓ తాడు ముడివేసి.. ఈ తాళి కట్టేస్తానని, టీసీ ఇచ్చి పంపిస్తానని విద్యార్థులను భయపెట్టేవాడు ఈ దుర్మార్గుడు. దువ్వెనతో వారి తలలు దువ్వి, పౌడర్ రాసి, బొట్టు బిళ్లలు పెట్టేవాడని చిత్తూరు ఆర్డీవో రేణుక, డీఈవో పురుషోత్తం, ఎంఈవో నాగేశ్వరరావు, తహసీల్దారు సుశీలమ్మ, ఎంపీడీవో విద్యారమ, గ్రామస్తుల సమక్షంలో విలపించారు విద్యార్థులు. అంతేగాక, తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని వాపోయారు.
టీచర్ వేధింపులతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినులు
ఈ నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు, గ్రామ సర్పంచ్ ద్వారా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. విచారణకు ఆదేశించారు. టీచర్ పైశాచిక వేధింపుల గురించి చిత్తూరు ఆర్డీవో, డీఈవో, ఎంఈవో, తహసీల్దార్, ఎంపీడీవో, స్థానికుల ముందు చెబుతూ విద్యార్థినిలు కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో డీఈవో నిందిత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అబు మీద పోక్సో కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆర్డీవో ఆదేశాలిచ్చారు. ఆర్డీవో ఆదేశాలతో అబును పోలీసులు అరెస్ట్ చేశారు.
తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిపై 10 నెలలుగా అత్యాచారం
ఇది ఇలావుండగా, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కూతూరిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి ఆమెపై 10 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్సింది. బంధువులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక వయసు 17 సంవత్సరాలు. కోమటి సురేష్ అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సురేష్ను అరెస్ట్ చేశారు. ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.