అప్పు తీర్చాలని భర్త కిడ్నీ అమ్మేసి పరారైన భార్య
ప్రకాశం: తన భర్త ప్రాణాల కోసం భార్య, భార్య ప్రాణాలను కాపాడేందుకు భర్త కిడ్నీలను అమ్ముకున్న గొప్ప ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. తాను చేసిన అప్పులు తీర్చడం కోసం తన భర్త కిడ్నీని అమ్మేసింది ఓ భార్య. అంతేగాక కిడ్నీ అమ్మితే వచ్చిన డబ్బు తీసుకున్న ఆ ఇల్లాలు, భర్తను మాత్రం ఆస్పత్రిలోనే వదిలేసింది. ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజక వర్గంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా చీరల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన ఆంధ్రా కృపారావుకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన గౌరీదేవికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా గత రెండేళ్ల నుంచి గౌరీదేవి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు కృపారావు.

అయితే కొన్ని రోజుల క్రితం కృపారావుకు ఫోన్ చేసిన గౌరీదేవి.. తనకు రూ. 3 లక్షల అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చాలని ఆయనను వేడుకుంది. తన కిడ్నీ అమ్మితే.. రూ. 5 లక్షలు వస్తాయని, అప్పులు తీర్చాక పిల్లలతోపాటు సంతోషంగా ఉండొచ్చని అతన్ని నమ్మించింది. దీంతో తన పిల్లల గురించి ఆలోచించిన కృపారావు, తన కిడ్నీని అమ్మేందుకు అంగీకరించాడు.
విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కృపారావుకు ఆపరేషన్ చేయించి, దళారుల సాయంతో అతని కిడ్నీని అమ్మించింది అతని భార్య గౌరీదేవి. వచ్చిన రూ. 5 లక్షలు తీసుకున్న గౌరీదేవి, భర్తను అక్కడ్నే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో అతన్ని ఆస్పత్రి యాజమాన్యం బయటికి పంపించేసింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న కృపారావు తిరిగి అతని తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.
తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్కు వివరించాడు. ఆయన ఆదేశాల మేరకు టూటౌన్ సిఐని కలవగా.. తమకు సంబంధం లేదని విశాఖపట్నంలోనే కేసు పెట్టాలని చెప్పడంతో తీవ్ర అసహనానికి గురైన కృపారావు మీడియాను ఆశ్రయించాడు. కాగా తమ కుమారుడికి న్యాయం చేయాలని కృపారావు తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications