కొత్తగా పెళ్లైన యువకుడి ఆత్మహత్య: భార్యను నరికి చంపిన భర్త
వరంగల్/మెదక్: పెళ్లయిన 13 రోజులకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. డిసెంబర్ 31న స్నేహితులతో అర్ధరాత్రి దాకా ఆనందంగా గడిపిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగుల శ్రీకాంత్(26) కొన్నేళ్ల పాటు గల్ఫ్కు వెళ్లి ఇటీవల ఇంటికి వచ్చాడు.
డిసెంబర్ 18న గోరింట్యాలకు చెందిన మాధవిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నూతన సంవత్సర వేడుకల కోసం మాధవి పుట్టింటికి వెళ్లగా, శ్రీకాంత్ బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి విందులో పాల్గొన్నాడు. అర్ధరాత్రి వరకు వారితో గడిపి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, భర్త మరణవార్త విన్న మాధవి సంఘటనా స్థలానికి చేరుకొని విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెళ్లి కోసం ఇంటి ముందర వేసిన పందిరి కూడా తీయక ముందే వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, శ్రీకాంత్ పెళ్లికి సంబంధించిన వ్యవహారంపై తల్లిదండ్రులతో ఇటీవల గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
కుటుంబ కలహాలతోనే శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతుండగా, తన కొడుకు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి పర్శరాములు పోలీసుల ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ నరేశ్కుమార్ సందర్శించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త
వరంగల్: అనుమానమే పెనుభూతంగా మారి ఓ మహిళ ప్రాణాలను తీసింది. అనుమానం పెంచుకున్న ఓ భర్త.. తన భార్యపై గొడ్డలితో దాడి చేయగా తీవ్ర గాయాలపాలై ఆమె మృతి చెందింది. ఈ దారుణ ఘటన కులకచర్ల మండలం మొగుళ్లపల్లి గ్రామంలో జరిగింది. మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన చౌకపల్లి మాణెమ్మ (30), అలియాస్ చిట్టెమ్మకు అదే గ్రామానికి చెందిన ఫకీరయ్యతో ఎనిమిది సంవత్సరాల కిందట వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. కొంత కాలంపాటు బాగానే ఉన్నా.. క్రమంగా భార్యపై అనుమానం పెంచుకొని గురువారం ఉదయం భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడిక్కడే మృతిచెందింది. ఫకీరయ్య అక్కడి నుంచి పారిపోయాడు. మృతురాలి వదినె చెన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.