కేజ్రీవాల్ నెక్స్ట్ టార్గెట్ - ప్రాంతీయ పార్టీల్లో సంచలనం : ఏపీలో సైలెంట్ ఆపరేషన్..!!
కేజ్రీవాల్. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న అరుదైన గౌరవం. ఇప్పుడు నాన్ కాంగ్రెస్ - నాన్ బీజేపీ పార్టీలకు దిక్సూచీగా మారనున్నారు. ఆప్ నేతలు భావి ప్రధాని అంటూ కేజ్రీవాల్ ను ఆకాశానికెత్తుతున్నారు. అయితే, పంజాబ్ లో ప్రధాన పార్టీలను అందునా..అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఓడించి ప్రభుత్వం ఏర్పాటు చేయటం అంత సులువైన విషయం కాదు. ఢిల్లీలో రెండో సారి అధికారంలో కొనసాగుతున్న కేజ్రీ తమ ప్రస్థానం ఢిల్లీ..పంజాబ్ తో ఆపేందుకు సిద్దంగా లేరు. ఆయన స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అధికారం
2012లో తన మిత్రులతో కలిసి కేజ్రీవాల్ ఆప్ స్థాపించారు. 2017లో ఆప్ పంజాబ్ లో కేవలం 20 స్థానాలకే పరిమితం అయింది. కానీ, ఇప్పుడు ఏకపక్షంగా ఇతర పార్టీలను ఊడ్చేసింది. గోవా లోనూ ఆప్ ఫోకస్ పెట్టింది. కానీ, పంజాబ్ లో గెలిచే అవకాశాలు ఉండటంతో..మరింత అక్కడే శక్తిని కేంద్రీకరించింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం..ప్రధాని మోదీని రాజకీయంగా వ్యతిరేకించే పార్టీలైన టీఎంసీ, డీఎంకే, టీఆర్ఎస్, సమాజ్ వాదీ, శివసేన, టీఆర్ఎస్ వంటి పార్టీలు తమ రాష్ట్రాలకే పరిమితం. కానీ, ఆప్ మాత్రం రెండు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకొని జాతీయ పార్టీగా అవతరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కేజ్రీవాల్ కు అండగా నిలిచేందుకు వివిధ ప్రాంతీయ పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ప్రాంతీయ పార్టీల్లో కొత్త చరిత్ర
అయితే, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం త్వరలో కేజ్రీవాల్ తో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఆసక్తి కర అంశఆలు ఏపీలో చర్చకు వస్తున్నాయి. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ లో వచ్చే ఎన్నికల్లో ఆప్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ మేరకు సర్వేలు సైతం చేయించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో తమ అభ్యర్ధులను నిలబెట్టే యోచన లో ఆప్ నేతలు ఉన్నారని తెలుస్తోంది. ఆప్ తో పొత్తుకు సైతం రెండు పార్టీలు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా టీడీపీ లేదా జనసేనతో ఆప్ ఏపీలో పొత్తుతో వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కేజ్రీ మ్యాజిక్ పై పెరుగుతున్న నమ్మకం
జనసేన అధినేత ఈ నెల 14వ తేదీన జరిగే పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పొత్తులు..2024 ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలు - కార్యచరణను ప్రకటించనున్నట్లు గా తెలుస్తోంది. అయితే, టీడీపీతో పొత్తు పైన ఆయన ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోరని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా టీడీపీ సైతం పొత్తుల కోసం వెంపర్లాడుతున్నామనే భావన ప్రజల్లోకి వెళ్లకుండా ఆచి తూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ సమయంలో ఆప్ వంటి పార్టీల పైన ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఏపీలో ఎంత మేర వర్కవుట్ అవుతుందనే లెక్కలు వేస్తున్నారు. విద్యావంతులు.. మధ్య తరగతి ప్రజలు..ఉద్యోగులు..యువత ఆప్ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..ఏపీలో సామాజిక వర్గాలే రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించనున్నాయి.
Recommended Video

ఏపీలో ఎంట్రీ తో మారనున్న సమీకరణాలు
ఇదే సమయంలో కాపు నేతల సమావేశాలు.. బీసీ-ఎస్సీ వర్గాలతో కలిసి ముందుకు సాగాలనే నిర్ణయాల నడుమ..ఆప్ ఏపీలో రాజకీయంగా తీసుకొనే నిర్ణయం ప్రభావం చూపించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆప్ ఏపీలో ఎన్నికల బరిలోకి ఒంటరిగా లేదా మిత్రపక్షంగా బరిలోకి దిగినా చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావం ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఏపీలో ఎన్నికల సమయంలో ఆప్ ఏం చేయబోతోందనే దాని పైన ఇప్పటికే సైలెంట్ ఆపరేషన్ మొదలైందనే చర్చ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications