జనసేన పార్టీ ఉందా: పవన్ కళ్యాణ్ పార్టీపై విలేకరులకు ఏఏపీ నేత షాక్
చిత్తూరు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురించి తమకు తెలియదని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్పారు. అసలు ఆ పేరుతో ఓ పార్టీ ఉందా, తమకు తెలియదే అని చెప్పడంతో విలేకరులు కంగు తిన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి-బిజెపి కూటమికి జనసేన మద్దతు పలికిన విషయం తెలిసిందే.
తిరుపతిలో ఏఏపీ నేతలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత సోమనాథ్ భారతి మాట్లాడారు. విలేకరులు మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించారు.
దానికి సోమనాథ్ భారతి మాట్లాడుతూ.. ఆ పేరుతో ఓ పార్టీ ఉన్నట్లు తమకు తెలియదని చెప్పారు. సోమనాథ్ దక్షిణాది ఏఏపీ ఇంచార్జ్, ఇదే విషయమై మీడియా అడిగింది. మీరు దక్షిణాది పార్టీ ఇంఛార్జ్ అని, మీకు జనసేన గురించి తెలియదా అని ప్రశ్నించారు. దీంతో ఆయన ముఖం అదోలా పెట్టారు. కాగా, ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. హోదా కోసం గట్టిగా కొట్లాడాలన్నారు. 2019 నాటికి ఏపీలో కీలకంగా ఎదుగుతామన్నారు.