Aaraa Mastanకు పదే పదే ఫోన్లు చేసిన ఆ పార్టీ బడా నేతలు: మిస్డ్ కాల్ లిస్ట్ రివీల్
Aaraa Mastan survey: దేశవ్యాప్తంగా చివరి విడత లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్నాయి. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై జాతీయ స్థాయి సంస్థలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వేర్వేరు అంచనాలను వెల్లడించాయి.
అసెంబ్లీలో ఒక రకంగా, లోక్సభలో మరో తీరుగా అవి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. చాణక్య ప్రతినిధి పార్ధా దాస్, పోల్ స్ట్రాటజీ, జన్మత్, పోలిటికల్ క్రిటిక్ వంటి సర్వే ఏజెన్సీలో వైఎస్ఆర్సీపీకి పూర్తిస్థాయి మెజారిటీని ప్రకటించాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలు మాత్రం దీనికి పూర్తి భిన్నమైన ఫలితాలను విడుదల చేశాయి.

ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ ఆరా అధినేత ఆరా మస్తాన్ విడుదల చేసిన సర్వే నివేదికల ప్రకారం చూసుకుంటే- ఈ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురబోతోంది. వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 105 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. 49.57 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ తన ఖాతాలో వేసుకునేవి 13 నుంచి 17 స్థానాలు ఉండొచ్చు.
తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి 71 నుంచి 81 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయి. లోక్సభలో 10 నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ కూటమికి పడే ఓట్ల శాతం 47.55 శాతం వరకు ఉండొచ్చు. టీడీపీ కూటమికి పురుషుల ఓట్లు 51.56, మహిళల ఓట్లు 54.76 శాతం మేర పడ్డాయని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది.
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీ ఎందుకు విజయం సాధిస్తుందనడానికి గల కారణాలను వివరించారు ఆరా మస్తాన్. వేర్వేరు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జగన్ను ప్రేమించిన వర్గాలు, ఆయన ప్రభుత్వంలో లబ్దిపొందిన వారికి జరుగుతున్న యుద్ధంగా పేర్కొన్నారు.
జగన్, ఆయన అనుసరించే విధానాలతో విభేదించిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడి అభిమానుల మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణించారు. తన ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పే పరిస్థితి ఎంత మాత్రం లేదని ఆరా మస్తాన్ తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన సీట్ల సంఖ్య ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గబోదని అన్నారు.
ఎన్నికల సర్వే కొనసాగుతున్న సమయంలో పలువురు సీనియర్ నాయకులు తనకు ఫోన్ కాల్స్ చేశారని వివరించారు. వాటికి తాను బదులు ఇవ్వలేదని చెప్పారు. ఆ మిస్డ్ కాల్స్ జాబితాను యూట్యూబ్ ఛానల్ యాంకర్ చదివి వినిపించారు.
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి, సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేవైఎం నాయకుడు విష్ణువర్ధన్, వైఎస్ఆర్సీపీకి చెందిన మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని రఘురామిరెడ్డి, టీఎన్ఏ నాయుడు, గుంటూరుకు చెందిన వైసీపీ నేత గులాం రసూల్, బీజేపీ నేత అడపా నరేంద్ర, అవనిగడ్డకు చెందిన జనసేన నేత పాపారావు.. వంటి నాయకుల మిస్డ్ కాల్స్ ఆయన కాల్ లిస్ట్లో ఉన్నాయి.
అన్ని పార్టీలతో పోల్చుకుంటే తనకు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయని, ఎక్కువగా ఆ పార్టీ నేతలతో పరిచయాలు ఉన్నట్లు చెప్పారు ఆరా మస్తాన్. ఆ తరువాత భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం వాటి తరువాతేనని వెల్లడించారు.












Click it and Unblock the Notifications