ఏపీలో కరోనా డేంజర్ బెల్స్... కొత్తగా 12వేల పైచిలుకు కేసులు... మరో 69 మంది మృతి...
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,634 కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులు 11వేల మార్క్ని దాటిన కేసులు ఇవాళ 12వేల మార్క్ని దాటాయి. మరో 69 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 10,33,560కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7685కి చేరింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62,885 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకూ 1,59,94,607 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 4304 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 9,36,143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 89732 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 1,680 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1628, గుంటూరు జిల్లాలో 1576, నెల్లూరు జిల్లాలో 1258, కర్నూలు జిల్లాలో 1158, అనంతపురం జిల్లాలో 1095 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 331 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 12 మంది కరోనాతో మృతి చెందారు.
కరోనా పరిస్థితులను అదునుగా చేసుకుని పేషెంట్లను ఆర్థికంగా దోపిడీ చేస్తున్న ఆస్పత్రులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రుల్లో చార్జీలపై ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చిందని... అన్ని ఆస్పత్రులు ఆ ఆదేశాలను పాటించాలన్నారు. దీనిపై పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. రెండెసివిర్ ఇంజెక్షన్కు రూ.2,500కు మించి వసూలు చేయకూడదని... అంతకుమించి వసూలు చేసే ఆస్పత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.అంతేకాదు,ఆ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి తప్పిస్తామన్నారు.