ఏక కాలంలో రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ ఇళ్లలో ఏసిబి సోదాలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరిన్ని ఆధారాల కోసం ఏసిబి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఓటుకు నోటు కేసులో నిందితులైన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా ఇళ్లల్లో ఏసిబి మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలు చేసింది.
మూడు బృందాలుగా బయల్దేరిన ఏసిబి ఒకేసారి జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో, నాగోల్లోని ఉదయ్ సింహ, ఎర్రగడ్డలోని సెబాస్టియన్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నిందితుల కుటుంబసభ్యులను ఏసిబి అధికారులు ప్రశ్నించారు. ఈ సోదాల్లో ఎలాంటి వస్తువులను సీజ్ చేయలేదని సమాచారం.
రేవంత్రెడ్డి బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ అధికారులు తెరచి తనిఖీలు నిర్వహించారు. రేవంత్రెడ్డి ఆస్తులకు సంబంధించి సోదాలు చేస్తున్నారు. రేవంత్రెడ్డికి బంజారాహిల్స్లో ఉన్న పాత ఇంట్లోను ఏసీబీ తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్లోని ఇంట్లో వారెంట్తో తనిఖీలు జరిపిన అధికారులు పాత ఇంట్లోనూ తనిఖీలకు వచ్చారు. పాత ఇంట్లో తనిఖీలకు వారెంట్ లేదని రేవంత్ కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా, ఈ సోదాలు ఏసిబి డిఎస్పీ సునీత ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముగ్గురు నిందితుల ఇళ్లల్లో సోదాలు సాధారణంగానే చేశామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఎటువంటి ఆధారాలు లభించలేదని సునీత తెలిపారు. ఉదయ్ సింహా ఇంట్లో లభించిన 10విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇది ఇలా ఉండగా, రేవంత్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసిబి అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా, మంగళవారంతో రేవంత్ రెడ్డి కస్టడీ ముగియనుంది. దీంతో సాయంత్రం 4 గంటలకు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు.