కళ్లు తిరిగే కరప్షన్: తూగో డీటీఓ మోహన్ ఆదాయం నెలకు రూ.3 కోట్లు..!
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ (డీటీఓ) ఆదిమూలం మోహన్ రూ.వందల కోట్ల అవినీతి పాల్పడినట్లు తేలడంతో ఏసీబీ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం, శుక్రవారం మోహన్ నివాసం, ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో రూ. వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి.
కాకినాడలోని డీటీఓ ఇంటిలో సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో తొమ్మిదిచోట్ల గురువారం ఉదయం నుంచి నిర్వహిస్తున్న దాడుల్లో రూ.వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతపురానికి చెందిన మోహన్ ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా జీవితం ప్రారంభించారు.
ఏడాదిన్నర తర్వాత 1989లో గ్రూప్-1లో ఎంపికై ఆర్టీఓగా బాధ్యతలు స్వీకరించారు. 1998లో డీటీసీగా పదోన్నతి పొందారు. అనంతపురం, చిత్తూరు, కరీంనగర్, విజయవాడ, ఏలూరుల్లో రవాణా శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు. పనిచేసిన ప్రతి జిల్లాలో రూ. కోట్లు ఆర్జించారనే ఆరోపణలున్నాయి.
ఏడాదిన్నరగా కాకినాడలో పనిచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన అవినీతి పెచ్చు మీరింది. కాకినాడ పోర్టుకు వెళ్లే ప్రతి లారీ నుంచి రవాణా శాఖ అధికారులు రూ. వెయ్యి వసూలును తప్పనిసరి చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా అధిక లోడుతో వెయ్యికి పైగా లారీలు పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి.
వీటికి సంబంధించి రోజుకు రూ.10 లక్షల చొప్పున నెలకు రూ.3 కోట్లు మోహన్కు ముడుపులు అందుతున్నాయని, చెక్పోస్టుల నుంచి రోజువారీ రూ.లక్ష వరకు అందుతున్నట్లు సమాచారం. మోహన్కు ఒక్క హైదరాబాద్లో ఉన్న ఆస్తుల విలువే రూ. 100 కోట్లుకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
దీంతో పాటు చిత్తూరు మోహన్కు చిత్తూరు, నెల్లూరు, బళ్లారిల్లోనూ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో కుమార్తె పేరుతో ఉన్న ఐదు బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల విలువ కూడా రూ. కోట్లలోనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్, కడప, బళ్లారి, అనంతపురం, విజయవాడ, ప్రొద్దుటూరు, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో శనివారం కూడా దాడులు కొనసాగిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంకా దాడులు కొనసాగుతున్నందున ఆస్తులపై పూర్తి సమాచారం ఇప్పుడే చెప్పలేమని అధికారులు అంటున్నారు.
మరోవైపు మోహన్ బంధువులు, బినామీల వివరాలను సేకరిస్తున్నామని, బ్యాంకు బ్యాలెన్స్లను తనిఖీ చేసి, లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బ్యాంకులో ఉన్న ఒక లాకర్ను తెరిచేందుకు మోహన్ అంగీకరించడంలేదని సమాచారం.
ఆ లాకర్ గనుక తెరిస్తే మోహన్కు సంబంధించిన అవినీతి చిట్టా బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు. కాకినాడలోని డీటీసీ కార్యాలయంలో శుక్రవారం పలువురిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మోహన్కు సంబంధించిన మరికొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది.
అతడి బంధువులు, స్నేహితుల వివరాలను ఇప్పటికే సేకరించిన అధికారులు వారి ఇళ్లపైనా దాడులు చేయనున్నట్లు తెలిసింది. దాడుల్లో భారీగా నగదు, బంగారం, వెండి వస్తువులు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, వ్యవసాయ భూ ములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి విలువను లెక్కకట్టే పనిలో ఉన్నారు.
మరోవైపు మోహన్కు సంబంధించిన ఆస్తుల, బినామీల వివరాలు ఏమైనా తెలిస్తే ఏసీబీ డీఎస్పీ కె.రమాదేవి, సెల్ నంబర్ 8332971044కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
రామాంజనేయులు ఇంటిపై ఏసీబీ దాడి
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పీయూడీఏ) వైస్ చైర్మన్ రామాంజనేయులు ఇంటిపై శనివారం ఏసీబీ అధికారులు మరోసారి దాడి చేశారు. భారీగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో రామాంజనేయులు నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
ఈ సందర్భంగా రామాంజనేయులు నివాసంలో రూ. కోటి 30 లక్షలు ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. బెంగాల్, అనంతపురం, హిందూపురంలో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే నెలరోజుల వ్యవధిలోనే ఆయన ఇంటిపై ఏసీబీ దాడులు చేయడం ఇది రెండోసారి కావటం గమనార్హం.