గనుల శాఖలో అవినీతి గని: ఎసిబి దాడిలో వెలుగుచూసిన వాస్తవాలు
శ్రీకాకుళంలో మైనింగ్ శాఖలో ఎడిగా పనిచేస్తూ లంచం తీసుకొని పట్టుబడిన భట్టు హనుమంతరావు నివాసాలపై ఎసిబి దాడులు నిర్వహించింది.
అమరావతి: అతడు పుట్టింది అతి సామాన్య కుంటుంబంలో.... ఉద్యోగం కూడా గనుల శాఖలో సహాయక సిబ్బంది స్థాయి నుంచే మొదలుపెట్టాడు... కట్ చేస్తే... 25 ఏళ్లు గడిచాయి... ఇప్పుడు ఆ శాఖలో ఆయనే ఒక అవినీతి గని.... భూగర్భ సంపద నంతా దోచేసి ఆగర్భ శ్రీమంతుడిలా తయారయ్యాడు... కనీసం వంద కోట్లు కూడా బెట్టాడు... స్థిరాస్థులకు కేరాఫ్ అడ్రస్ లా మారాడు... ఇంతటి ఘనత సాధించిన వ్యక్తి ఎవరో చూడాలనుకుంటున్నారా? ఇన్ని ఘన(గని)కార్యాలను సాధించిన వ్యక్తి ఈయనేనండి...పేరు భట్టు హనుమంతరావు...

పాతికేళ్ల క్రితం
పాతికేళ్ల క్రితం మైనింగ్ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గా కెరీర్ ఆరంభించిన భట్టు హనుమంతరావు ఆ తరువాత అదే శాఖలో పదోన్నతుల ద్వారా రాయల్టీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ జియాలజిస్ట్, జియాలజిస్ట్ స్థాయికి వచ్చాడు. క్షేత్రస్థాయితో సంబంధం ఉండే రాయల్టీ ఇన్స్ పెక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, జియాలజిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ హోదాను అడ్డుపెట్టుకుని అక్రమార్జనకు తెగబడ్డాడు. నవ్యాంధ్ర నడిబొడ్డున రూ. 100 కోట్లకు పైగా విలువైన పాతిక ఫైనే స్థిరాస్తులు సంపాదించాడు. అయితే ఇవన్నీ ఇంతవరకు వెలుగుచూసినవి మాత్రమే...లెక్కకు రానివి ఇంకెన్ని ఉన్నాయో తేలాల్సిన పరిస్థితి. క్రిందటి నెలలోనే శ్రీకాకుళంలో 5లక్షల రూపాయలు లంచం తీసుకొంటూ ఎసిబికి పట్టుబడిన హనుమంతరావుపై ఆ శాఖ పూర్తి దృష్టి సారించింది.

ఎసిబి ఎటాక్...
ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాలతో మంగళవారం రంగంలోకి దిగిన అధికారులు హనుమంతురావుకు సంబంధించిన శ్రీకాకుళం,గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లోని ఏడు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు జరిపారు. ఈ సోదాల్లో హనుమంతరావుకు సంబంధించి ఇప్పటివరకు ఎసిబి వెలికి తీసిన అవినీతి ఆస్తుల చిట్టా ఇది...

అక్రమార్జన చిట్టా...
సొంతూరు అయిన ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని పావులూరులో 5 ఎకరాల్లో గ్రానైట్ కంపెనీ,గుంటూరులోని కొరిటెపాడు మెయిన్రోడులోని కిలారి టవర్స్లోని ఆయన నివాసం, ఆర్.అగ్రహారంలో మరో ఫ్లాట్ ,నల్లపాడు, గోరంట్ల, పెదపలకలూరు, లాం లలో నివాస స్థలాలు, నెల్లూరులో నివాస, వాణిజ్య స్థలాలు, కృష్ణా జిల్లా నిడమానూరు, హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో నివాస, వాణిజ్య స్థలాలు, గుంటూరులో హనుమంతరావు దంపతుల పేరిట చెరో రూ.3 కోట్లు విలువైన రెండు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో భార్య పేరుతో 1.42 ఎకరాల వ్యవసాయ భూమి, కుమారుడు కృష్ణ పేరుతో గుంటూరు జిల్లా పత్తిపాడులో మూడు నివాస స్థలాలు, తల్లి తులశమ్మ పేరుతో ప్రకాశం జిల్లా ఇంకొల్లులో 4 ఎకరాల వ్యవసాయ భూ మి, రూ.3 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.86 వేల నగదు, రూ.5లక్షల విలువైన గృహోపకరణాలు, 353 గ్రాముల బంగారు నగలు, 1.6కిలోల వెండి వస్తువులు, కారు, నాలుగు బైకులు, రూ.50లక్షలకు పైగా ఖర్చుచేసి కుమారుడు, కుమార్తెకు విదేశాల్లో చదువులు...

అవినీతి అధికారి అరెస్ట్..
లంచం తీసుకోవటంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న భట్టు హనుమంతరావును అరెస్ట్ చేసిన ఎసిబి అధికారులు అతడిని ఎసిబి స్పెషల్ కోర్టు ఎదుట హాజరుపర్చారు. అవినీతికి పాల్పడిన అధికారుల ఆస్థులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఉద్యోగం నుంచి తొలగించినప్పుడే అవినీతికి అడ్డుకట్టవేయగలమనేది ప్రజల అభిప్రాయం.












Click it and Unblock the Notifications