మెరైన్ సీఐ అక్రమాస్తి రూ.2కోట్లు: బిర్యానీలో భార్యకు విషంపెట్టి హత్య
విశాఖ: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కు మరో అవినీతి చేప చిక్కింది. మెరైన్ సిఐగా పని చేస్తున్న హుస్సేన్ ఆస్తుల పైన పోలీసులు ఏకకాలంలో 16 చోట్ల దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎసిబి అధికారులు దాదాపు రూ.2 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
పూడిమడక మెరైన్ సీఐ అయిన హుస్సేన్ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేపట్టామని ఎసిబి అధికారులు చెప్పారు.
హుస్సేన్ ఇంటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రాజాం, పెందుర్తి, బెంగళూరులోని ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. గతంలో సిమ్స్ కుంభకోణంలోనూ హుస్సేన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
కడప జిల్లాలో దారుణం
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలకు బిర్యానీలో విషం ఇచ్చి చంపేశాడు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. అప్పుడే తన భార్య, పిల్లలు అదృశ్యమైనట్లు అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి ఆచూకీ కోసం రెండు నెలలుగా గాలిస్తున్నారు.
ఏ రకంగాను ఆధారాలు వారికి లభించలేదు. దీంతో భర్తనే తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు అతను అంగీకరించాడు. బిర్యానీలో విషం పెట్టి చంపినట్లు వెల్లడించాడు. వారిని అప్పుడే ఖననం చేసినట్లు చెప్పాడు. నిందితుడిని పోలీసులు ఖననం చేసిన చోటుకు తీసుకువెళ్లారు.
సీఐడీ కస్టడీకి అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండీ
అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకట రామారావు, ఎండీ నారాయణలు పశ్చిమ గోదావరి జిల్లా న్యాయస్థానం అనుమతితో వారం రోజులు సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.30గంటల సమయంలో నిందితులను ఏలూరులోని జిల్లా సబ్జైలు నుంచి తరలించారు.
వివిధ కోణాల్లో దర్యాప్తు నిమిత్తం వారం రోజులు వారిని ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు సిఐడి అధికారులు తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యాలను ఇక్కడి నుంచి తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు పెద్ద ఎత్తున జైలుకు వచ్చారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి సంఘటనలు జరుగకుండా వారిని అక్కడి నుంచి పంపించారు.
పంచాయతీ కార్యదర్శి హత్య
కర్నూలు జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శిని దుండగులు హత్య చేశారు. హతుడి పేరు ఇమ్మాన్యుయేల్. ఓర్వకల్లు మండలంలోని పూడికచర్ల వద్ద అతని మృతదేహం లభ్యమైంది. ఇతను చుంచుఎర్రగుడి, కంబాలపాడు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు.
ఖాతాదారులకు కుచ్చుటోపి
ప్రకాశం జిల్లాలోని పామూరులో ఓ షోరూం నిర్వాహకులు ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టారు. ద్విచక్ర వాహనాల కోసం ఖాతాదారుల నుంచి నెలకు రూ.1500ల చొప్పున వసూలు చేశారు. ఇలా వెయ్యి మంది నుంచి 36 నెలల పాటు వసూలు చేశారు. ఖాతాదారులకు బైకులు ఇచ్చే సమయంలో షోరూంలోని వాహనాలతో పరారవుతుండగా బాధితులు అడ్డుకున్నారు. నిర్వాహకుల పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు.