దూడల రాజేష్, గంగిరెడ్డితో జగన్ ఫొటోలు, బంధువులా: అచ్చెన్నాయుడు, ఫొటోలతో అయిపోలేదు: జగన్
హైదరాబాద్: టిడిపి శాసనసభ్యుడు బోడె ప్రసాద్పై ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిస్పందించారు. వైయస్ జగన్ కాల్ మనీ నిందితుడు దూడల రాజేష్తో ఫొటో దిగారని, ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డితో ఫొటో దిగారని, అంత మాత్రాన వారితో కలిసి జగన్ తప్పు చేశాడని తాము అనడం లేదని ఆయన అన్నారు.
వారు మీకు బంధువులా, వారితో ఫొటోలు ఉన్నంత మాత్రాన మేం విమర్శిస్తున్నామా అని అచ్చెన్నాయుడు అడిగారు. అచ్చెన్నాయుడి మాటలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని జగన్ అన్నారు. ఫొటోలు దిగడంతో అయిపోలేదని ఆయన అన్నారు. కాల్ మనీ నిందితుల్లో ఒకతను ఇంటలిజెన్స్ ఐజితో క్యాజువల్గా మాట్లాడుతూ కనిపించారని, చంద్రబాబు ఫొటో కూడా ఉందని, ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలని ఆయన అన్నారు.
కాల్ మనీ వ్యవహారంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వర రావును అరెస్టు చేశారని, అయితే నాగేశ్వర రావుతో బుద్ధా వెంకన్నకు సంబంధం లేదని అంటున్నారని జగన్ అన్నారు. ఈ సమయంలో టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జోక్యం చేసుకుని, వారిద్దరు విజయనగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారని, ఒకరికొకరికి సంబంధం లేదని అన్నారు. ఈ సమయంలో జగన్ కల్పించుకుని - గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని అన్నారు.
దానికి గద్దె రామ్మోహన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను గెస్ట్ హౌస్లో నిందితులతో కలిసి విందులో పాల్గొన్నట్లు ఉన్న ఫొటో మార్ఫింగ్ చేశారని ఆయన అన్నారు. తాను నిందితులతో కలిసి విందులో పాల్గొన్నట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, ఈ భూమి నుంచి కూడా శాశ్వతంగా వెళ్లిపోతానని గద్గె రామ్మోహన్ అన్నారు. తాను ఇంట్లో తప్ప బయట ఎక్కడా తిననే విషయం విజయవాడ ప్రజలకే కాకుండా కృష్ణా జిల్లా ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు.
దూడల రాజేష్తో తాను దిగినట్లు చెబుతున్న ఫొటోను ఓసారి చూపించాలని జగన్ అడిగారు. దానికి మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిస్పందిస్తూ - ఫోటోను పట్టుకుని, ఈ ఫొటోల ఉన్నంత మాత్రాన దూడ రాజేష్ కార్యకలాపాలతో జగన్కు సంబంధం ఉందని అనడం లేదని అన్నారు. నిజం ఒప్పుకున్నారని జగన్ అంటూ దూడ రాజేష్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేశారని మీరే చెప్పారని అన్నారు.