కొండ చరియలు విరిగిపడి నలుగురు సజీవ సమాధి: పరిహారం ప్రకటించిన గంటా
విశాఖపట్నం: నగరంలోని తాటిచెట్లపాలెంలో సంజీవయ్య కాలనీలో ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కాలనీలో కొన్ని ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ సమాధి అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన సూరి(55), మరియమ్మ(45), బాల(40), శ్రీరాం(20) విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. కాగా, చికిత్స పొందుతూ శ్రీరాం ఆదివారం ఉదయం 9గంటలకు మృతి చెందాడు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
విశాఖలో శనివారం సాయంత్రం నుంచి బాగా వర్షం కురిసింది. ఈ వర్షానికి బాగా తడిసి కొండచరియలు జారిపడి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కాగా, మృలు సూర్యనారాయణ(65), మహాలక్ష్మి(55), ఆదినారాయణ(7), శ్రీరాం(20)గా పోలీసులు గుర్తించారు.

కాగా, ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్, అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.
దురదృష్టకరం: గంటా
సంజీవయ్య కాలనీలో కొండ చరియలు విరిగిపడిన ఘటన దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ ఘటన సమాచారం తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందినట్లు చెప్పారు.
నగరంలో కొండ చరియల ప్రమాదం పొంచివున్న ప్రాంతాల్లో వేలాదిమంది నివాసం ఉంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం అంచున ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారికి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications