సంతమాగులూరు సర్పంచ్ హత్య కేసు: వీడిన మిస్టరీ, అద్దంకి పీఎస్లో లొంగుబాటు
అమరావతి: ప్రకాశం జిల్లాలో సంచనలం సృష్టించిన సంతమాగులూరు సర్పంచ్ని అతి కిరాతకంగా గొడ్డళ్లతో నరికి చంపిన కేసులో నిందితుడు ఎవరో తెలిసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు చిన్న వెంకటరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు చిన్న వెంకటరెడ్డి స్వయంగా శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లాలోని అద్దంకి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పాత కక్షల నేపథ్యంలో వెంకటరెడ్డిన హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 11వ తేదీన వైసీపీ మద్దతుతో గెలిచిన సంతమాగులూరు సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి (45)ని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపిన సంగతి తెలిసిందే.
సంతమాగులూరు గ్రామం ప్యాక్షన్ కక్షలకు పెట్టింది పేరు. అయితే గత కొంతకాలంగా గ్రామంలో ప్యాక్షన్ కక్షలకు తెరపడి గ్రామస్తులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అయితే సర్పంచ్ వెంకరెడ్డి హత్యతో గ్రామంలో ఉద్రికత్త పరిస్ధితులు నెలకొన్నాయి.
వెంకటరెడ్డి హత్య జరిగిన రోజున ఏం జరిగిందంటే
గ్రామంలో నిర్మిస్తున్న దేవాలయానికి ధ్వజస్తంభం కొనుగోలు చేసేందుకు అంతకముందు తనతోపాటు నలుగురు గ్రామస్తులను తీసుకుని వెళ్లారు. ఏప్రిల్ 10 రాత్రి ఇంటికి వచ్చిన ఆయన ఆరుబయట చెట్టు కింద రాంబాబు అనే వ్యక్తితో కలసి కూర్చుని ఏదో ముచ్చటిస్తున్నారు.
ఈ సమయంలో కుటుంబసభ్యులంతా ఇంట్లో ఉన్నారు. ఇదే సరైన సమయమని అదును చూసుకుని అదే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వచ్చి వెంకటరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఆయన్ను గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఈ దాడిలో సర్పంచ్ వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
దాడి మధ్యలో అడ్డు వచ్చిన రాంబాబును సైతం పక్కకు ఈడ్చి పడేశారు. అయితే వచ్చినవారు ఎవరైంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ దాడి ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై రాఘవరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
గ్రామంలో వెంకటరెడ్డి సౌమ్యునిగా పేరుపొందారు. గ్రామంలో మంచి నేతగా పేరు కూడా సంపాదించుకున్నారు. వెంకటరెడ్డి హత్యకు గురైన విషయాన్ని తెలుసుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించిన సంగతి తెలిసిందే.