అచ్చెన్నపైనా డాక్టర్ సుధాకర్ స్ట్రాటజీ.. టీడీపీ సెల్ఫ్ అరెస్టుల ఉద్యమం.. బెయిల్ వస్తుందా? లేకుంటే..
ఒకరేమో పార్టీతో నేరుగా సంబంధం లేని వ్యక్తి.. ఇంకొకరు ఏకంగా పార్టీ లెజిస్లేటివ్ విభాగానికి ఉప నేత.. ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది వైద్యరంగానికి సంబంధించిన అంశాల్లోనే.. పైగా ఒకరు ఎస్సీ, ఇంకొకరు బీసీ వర్గానికి చెందినవారు.. ఈ ఇద్దరి అరెస్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఒకే స్ట్రాటజీని అనుసరిస్తున్నది. హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మరోసారి సెల్ఫ్ అరెస్టు ఉద్యమాన్ని చేపట్టారు.

ఆ కులాలంటే చిన్న చూపు..
పైకి మామూలుగా కనిపించినా.. డాక్టర్ సుధాకర్, అచ్చెన్నాయుడి అరెస్టులు.. వైఎస్ జగన్ లోని కులదురంహంకారానికి అద్దం పడుతున్నాయని.. ఎస్సీ, బీసీలను ముఖ్యమంత్రి వేధిస్తున్నాడని ప్రతిపక్ష టీడీపీ తీవ్ర ఆరోపణ చేసింది. గతంలో అచ్చెన్నన్ను ఉద్దేశించి జగన్ చేసిన ‘బంట్రోతు' వ్యాఖ్యల క్లిప్పింగులను తెలుగు తమ్ముళ్లు మళ్లీ తెరపైకి తెచ్చారు. బీసీ, ఎస్సీల పట్ట జగన్ చిన్నచూపుతో వ్యవహరిస్తారని, గడిచిన ఏడాదికాలంలో అచ్చెన్నాయుడు పర్సనాలిటీపై స్వయంగా సీఎం ఎన్నోసార్లు వ్యంగంగా మాట్లాడారని, మంత్రులచే తిట్టంచి, అవమానించడమే కాకుండా తప్పుడు కేసులు సైతం బనాయించారని మండిపడింది.

నన్నూ అరెస్టు చేయండంటూ..
నెల రోజుల కిందట డాక్టర్ సుధాకర్ అరెస్టు సందర్భంలో.. ఆయనకు సంఘీభావం తెలిపిన టీడీపీ.. డాక్టర్ చేసిన వ్యాఖ్యలనే రిపీట్ చేస్తూ.. సెల్ప్ అరెస్టుల ఉద్యమాన్ని చేపట్టడం తెలిసిందే. ఇప్పుడు అచ్చెన్న విషయంలోనూ తెలుగు తమ్ముళ్లు అదే పంథాను అనుసరిస్తున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ టీడీపీ కార్యకర్తలు ‘‘నేను కూడా బీసీనే.. నన్ను అరెస్టు చేయండి..'', ‘‘నేను కూడా ఎస్సీనే నన్నూ అరెస్టు చేయండి''అని రాసున్న ప్లకార్డులతో తమ నిరసన తెలియజేస్తున్నారు.

బెయిల్ రాకుంటే రచ్చే..
రూ.900 కోట్ల విలువైన ఈఎస్ఐ కుంభకోణంలో నలుగురు వైద్య అధికారులతోపాటు అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని విజయవాడ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ అధికారులు తెలిపారు. హోం మంత్రి సుచరిత సైతం ఈ విషయాన్ని నిర్ధారించారు. కాగా, శని, ఆదివారాలు కోర్టులకు సెలవు కావడంతో వ్యూహాత్మకంగానే శుక్రవారం సాయంత్రం గడువుకు కొద్దిగా ముందు అచ్చెన్నను జడ్జి ముందు ప్రవేశపెట్టేలా అధికారులు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సైతం అచ్చెన్నన్ను బెయిల్ పై విడిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు సమాచారం. బెయిల్ రాని పక్షంలో రాబోయే రెండు రోజులు సెల్ఫ్ అరెస్టుల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని టీడీపీ యోచిస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్రానికి సంబంధమేంటి?
ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్టు చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తప్పుపట్టారు. ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ అని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం లోకల్ మోనిటరింగ్ వ్యవస్థనే తప్ప ఈఎస్ఐ వాటి లావాదేవీల్లో రాష్ట్ర మంత్రుల పాత్ర ఏమీ ఉండదని ఆయన చెప్పారు.

అచ్చెన్న పేరు లేదు..
‘‘2012లో విడుదలైన ఉత్తర్వుల ప్రకారం.. ఈఎస్ఐకి సంబంధించిన అన్ని వ్యవహారాలకు డైరెక్టర్ మాత్రమే బాధ్యుడవుతారు. తెలంగాణలోనూ ఇదే తరహా కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడగానీ, ఇప్పుడు ఏపీలోగానీ ఈఎస్ఐ అధికారులే బాధ్యులు అవుతారు. ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్మెంట్ లో కూడా నలుగురు డాక్టర్లను బాద్యులుగా చూపిందేగానీ.. అందులో అచ్చెన్నాయుడు పేరును ప్రస్తావించలేదు. తద్వారా ఈ అరెస్టు కేవలం రాజకీయ కక్ష సాధింపు తప్ప మరోటి కాదని స్పష్టంగా తేలిపోయింది''అని అయ్యన్నపాత్రుడు వివరించారు.
Recommended Video

కులాలకు సంబంధమేంటి?
అచ్చెన్నాయుడు అరెస్టును బీసీలపై జరిగిన దాడిగా టీడీపీ అభివర్ణించడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశిస్తే దాన్ని కమ్మ కులంపై కక్ష సాధింపు అన్నారు.. తప్పతాగి రోడ్డు మీద న్యూనెన్స్ చేస్తోన్న పిచ్చోడిని అదుపులోకి తీసుకుంటే దళితులపై వివక్షగా పేర్కొన్నారు.. ఇప్పుడు 900 కోట్ల ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నని అరెస్టు చేస్తే బీసీలపై దాడి అంటున్నారు.. ఇలా చేసిన ప్రతి తప్పుడు పనికీ కులాలను అంటగడుతోంటి టీడీపీ''అని ఎంపీ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications