పవన్పై నటుడు రాజా నిప్పులు, కాపునాడు మద్దతు
కాకినాడ: టిడిపి, బిజెపి కూటమికి మద్దతు పలుకుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన నటుడు రాజా నిప్పులు చెరిగారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను పవన్ చదువుతున్నారని ధ్వజమెత్తారు. పవన్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో విలేకరులతో మాట్లాడారు.
ఎవరో రాసిచ్చిన స్ర్కిప్టులు చదువుతూ జగన్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చేతనైతే పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. పరిశ్రమలో జరుగుతున్న అన్యాయం గురించి పవన్ ఎప్పుడైనా స్పందించారా? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుది అవసరానికి వాడుకుని వదిలేసే తత్వమన్నారు. గత ఎన్నికల్లో జూ ఎన్టీఆర్ను వాడుకున్నారని, ఇప్పుడు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను వాడుకుని వదిలేస్తారన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ను ఓదార్చడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ వస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన ఒకే ఒక్క వ్యక్తి జగన్ అన్నారు.

జగన్ పార్టీకి కాపునాడు మద్దతు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపునాడు మద్దతు ఇస్తోందని ఎపి కాపునాడు రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాపు కులస్థులకు న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కరేనని, కాపులను బిసిల్లో చేర్చేందుకు వైయస్ కృషి చేశారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెంటే కాపు సామాజిక వర్గమంతా ఉంటుందన్నారు. అసెంబ్లీ, లోకసభ అభ్యర్థుల జాబితాలో జగన్ పార్టీ కాపులకు సముచిత స్థానం కల్పించిందన్నారు.












Click it and Unblock the Notifications