జగన్ వద్దకు అదానీల పరుగులు ? గంగవరంపై వరుస షాకులు-తాజాగా ఒడిశాకు పెట్రోనెట్ జంప్
ఏపీలో పారిశ్రామిక దిగ్గజాలైన అదానీలకు మేలు చేసేందుకు సీఎం జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం వైసీపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. విశాఖలోని గంగవరం పోర్టు వాటాల్ని అదానీలకు కట్టబెట్టేందుకు వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టులో పిటిషన్లతో పాటు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న వేళ.. సీఎం జగన్ తో అదానీ సోదరులు భేటీ అయినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై వారు చర్చించారు. అదే సమయంలో గంగవరానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఇప్పుడు అదానీలతో పాటు జగన్ సర్కార్ కూ ఏం చేయాలో పాలుపోవడం లేదు.

ఏపీలో అదానీల అడుగులు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును చేజిక్కించుకోవడంతో అదానీల అడుగులు పడటం మొదలైంది. అప్పటివరకూ ఏపీతో అంటీముట్టనట్లు ఉన్న అదానీ గ్రూప్ ... వైసీపీ అధికారం చేపట్టాక తొలిసారి తమ గ్రూప్ కు చెందిన అదానీ పోర్ట్స్ ద్వారా నవయుగ గ్రూప్ చేతుల్లో ఉన్న కృష్ణపట్నం పోర్టును చేజిక్కించుకుంది. ఆ తర్వాత విశాఖ జిల్లాలోని గంగవరం పోర్టుపై కన్నేసింది. డీవీఎస్ రాజు కుటుంబం చేతుల్లో ఉన్న ఈ పోర్టులో మెజార్టీ వాటాలు కొనుగోలు చేసిన తర్వాత కూడా అదానీలు శాంతించలేదు. అందులో ఏపీ ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటా కూడా దక్కించుకున్నాయి. అదానీలు దక్కించుకున్నారనే దాని కంటే ఏపీ ప్రభుత్వమే దాన్ని విక్రయించేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు వరకూ చేరింది.

గంగవరం పోర్టు వివాదాలు
గంగవరం పోర్టును అదానీ పోర్ట్స్ చేజిక్కించుకున్న విధానం వివాదాలకు కారణమైంది. అంతా చట్టబద్ధమే అయినా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అదానీ గ్రూప్ దీన్ని దక్కించుకోవడానికి రహస్యంగా సహకరించిందన్న విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా గంగవరం పోర్టు నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం తరఫున ఇచ్చిన భూమికి పరిహారంగా ఈ పోర్టులో 10.4 శాతం వాటాలు లభించాయి. వీటిని అదానీ గ్రూప్ కు అమ్ముకోవాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదు. అదే సమయంలో రేపు అదానీ తీసుకనే నిర్ణయాలకు ఏపీ ప్రభుత్వం న్యాయపరంగా ఏ విధంగానూ అడ్డంకులు చెప్పలేదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం తనకున్న వాటాను అదానీ గ్రూప్ కు అమ్మేసుకోవాలని నిర్ణయించుకోవడం వివాదాస్పదమైంది.

విశాఖ స్టీల్ కోసమే గంగవరంపై కన్ను ?
మరోవైపు విశాఖలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( స్టీల్ ప్లాంట్ )ను కేంద్రం ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుందో అప్పుడే గంగవరం పోర్టుపై అదానీ గ్రూప్ కన్ను పడిందని మాజీ ఐఏఎస్ అధికారి శర్మ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగ్గరుండి మరీ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కంటే ముందే గంగవరం పోర్టును ప్రైవేటీకరణ పేరుతో అదానీకి కట్టబెట్టాయనే విమర్శలు వినిపించాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విమర్శలపై ఎక్కడా స్పందించలేదు. కేంద్రం అమ్మకానికి పెట్టిన విశాఖ స్టీల్ వాటాల్ని దక్కించుకునేందుకు స్టీల్ దిగ్గజాలైన టాటా స్టీల్, మిట్టల్ గ్రూప్ పోటీపడుతున్న తరుణంలో అదానీ గ్రూప్ కూడా ఈ రేసులో చేరిందనే వాదన వినిపిస్తోంది. అయితే తమకు విశాఖ స్టీల్ దక్కినా, దక్కకపోయినా గంగవరం పోర్టు రవాణా ద్వారా స్టీల్ ప్లాంట్ ను గుప్పిట్లో ఉంచుకోవచ్చని అదానీ గ్రూప్ భావించిందా అన్న అనుమానాలు శర్మ లేవనెత్తారు.

గంగవరం వాటాల విక్రయంపై హైకోర్టులో పిటిషన్
గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను అదానీ పోర్ట్స్ కు విక్రయించిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర హైకోర్టుకు చేరింది. దీనిపై ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేయడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. అదే సమయంలో అదానీ గ్రూప్ కూ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పోర్టును చట్టబద్ధంగానే తాము దక్కించుకున్నామని హైకోర్టులో నిరూపించుకోవాల్సిన పరిస్ధితి. ప్రభుత్వ వాటా అమ్ముకోవడంపై సర్కార్ కూడా హైకోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితి. దీంతో ఇప్పుడు ప్రభుత్వంతో పాటు అదానీలు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో త్వరలో దీనిపై విచారణ ప్రారంభం కానుంది.

జగన్ వద్దకు అదానీ సోదరుల పరుగులు ?
గంగవరం పోర్టు వాటాల విక్రయ ప్రక్రియ సాఫీగా పూర్తయినట్లు తాజాగా అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇందులో డీవీఎస్ రాజు కుటుంబానికి ఉన్న వాటాతో పాటు మిగతా వాటాల్ని కూడా అదానీ పోర్ట్స్ దక్కించుకుంది. వీటిపై పెద్దగా వివాదం లేకపోయినా ప్రభుత్వ వాటా విక్రయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని విచారణలో ఈ వ్యవహారాలన్నీ మరోసారి తెరపైకి రావడం ఖాయం. దీంతో అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీతో పాటు ఆయన సోదరులు కూడా సీఎం జగన్ వద్దకు తరలివచ్చారు. నిన్న సీఎం జగన్ తో వారు రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నిర్ధారించలేదు. దీంతో అధికారికంగానే జరిగిన గంగవరం పోర్టు వాటాల విక్రయం వ్యవహారంపై జగన్ తో అదానీల భేటీ గోప్యత ఎందుకున్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Recommended Video

ఒడిశాకు పెట్రోనెట్ తరలింపుతో భారీ షాక్
గంగవరం పోర్టును అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అటు అదానీలతో పాటు ఇటు ఏపీ సర్కార్ కూ షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోనెట్ సంస్ధ గంగవరం పోర్టులో ఏర్పాటు చేయాలని భావించిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ టెర్మినల్ ను ఒడిశాకు తరలించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ టెర్మినల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అదానీలకు కూడా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 2012లోనే గంగవరం పోర్టులో ఎల్ ఎన్ జీ టెర్మినల్ ఏర్పాటు కోసం పెట్రోనెట్ ఒప్పందం చేసుకుంది. నాలుగేళ్లలో ఇది పూర్తయి అందుబాటులోకి కూడా రావాలి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు సంస్ధలైన గెయిల్, ఓఎన్జీసీ, ఓవోసీఎల్, బీపీసీఎల్ పెట్రోనెట్ జాయింట్ వెంచర్ గా ఇది నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇది ఏర్పాటు కాకపోగా.. తాజాగా ఒడిశాలోని గోపాల్ పూర్ కు తరలిస్తున్నట్లు పెట్రోనెట్ తాజా వార్షిక నివేదికలో పేర్కొనడం కలకలం రేపుతోంది.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications