విజయమ్మది ఒప్పుకో మేం అంగీకరిస్తాం, పందులు అంటే: జగన్పై ఆదినారాయణ
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏఫీ మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది, ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు స్టేజి మీద ఉండగానే జగన్ తన పార్టీని ప్రకటించలేదా అని ప్రశ్నించారు.
ఆ రోజే జగన్ మా అందరినీ ఎందుకు రాజీనామా కోరలేదో చెప్పాలని నిలదీశారు. తాము 2014లో వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ బొమ్మలు పెట్టుకొని గెలిచామని చెబుతున్నారని, మరి అదే బొమ్మ పెట్టుకున్న విజయమ్మ విశాఖపట్నం ఎంపీగా ఎందుకు ఓడిపోయారో చెప్పాలన్నారు.

తల్లిని గెలిపించుకోలేని జగన్ మమ్మల్ని గెలిపించారా?
అసలు తల్లిని గెలిపించుకోలేని జగన్ తమను గెలిపించాడని ఎలా అనుకుంటున్నారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నంలో విజయమ్మ ఓటమికి తాను కారణం అని జగన్ అంగీకరిస్తే మా గెలుపుకు కూడా ఆయనే కారణమని ఒప్పుకుంటామని చెప్పారు.

పందులు అంటే వంద అంటాం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను పందులు అంటే మేం వంద అంటామని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. అసలు మీ కుటుంబం కన్నా (జగన్ ఫ్యామిలీ) మాకు గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. జగన్ ఉదయం లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి అని కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజా తీర్పును అవమానించినట్లే
ప్రతిపక్షం సభకు రాకపోవడం ప్రజా తీర్పును అవమానించినట్లేనని మంత్రి యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. సభకు రాకుండా జీత, భత్యాలు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. జీతభత్యాలపై ఉన్న శ్రద్ధ వారికి ప్రజా సమస్యలపై లేదన్నారు.

ప్రతిపక్ష పాత్ర కూడా మాదే
ప్రతిపక్షం లేకపోయినా ప్రజా సమస్యలను అధికార పార్టీ సభ్యులే లేవనెత్తుతన్నారని యనమల చెప్పారు. ప్రతిపక్ష పాత్రను కూడా మేమే పోషిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష వైసీపీని అసెంబ్లీకి రావాలని ఎన్నోసార్లు ప్రభుత్వం తరఫున కోరామని తెలిపారు. అయినా స్పందించలేదన్నారు.












Click it and Unblock the Notifications