మిష్టరీగా ఉంది, 5లక్షలు ఇస్తా, ప్రభుత్వ యంత్రాంగం భేష్: అదితి తండ్రి
విశాఖ: తన కూతురు అదితి అదృశ్యం ఘటన మిష్టరీగా ఉందని పాప తండ్రి శ్రీనివాస్ బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. అదితి బతికే ఉందని తాము గట్టిగా విశ్వసిస్తున్నామని చెప్పారు. తన కూతురు కోసం అన్వేషణలో ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పని చేస్తోందని చెప్పారు.
నా బిడ్డను సజీవంగా తెచ్చిన వారికి రూ.5 లక్షల రివార్డు ఇస్తానని చెప్పారు. తన పాప గురించి ఎవరికి తెలిసినా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంత వెతుకుతున్నప్పటికీ పాపకు సంబంధించిన ఏ వస్తువు దొరకడం లేదన్నారు.
పాప గురించి ఎవరికైనా తెలిస్తే ఈ నెంబర్కు ఫోన్ చేయాలని చెబుతూ ఓ నెంబర్ ఇచ్చారు. ఆయన ఈ సెల్ నెంబర్ ఇచ్చి 9701000564 అదితి గురించి తెలిస్తే ఫోన్ చేయాలని కోరారు.
కాగా, ఏపీలోని విశాఖలో ఆరేళ్ల బాలిక అదితి డ్రయినేజీలో ప్రమాదవశాత్తూ పడి గల్లంతై దాదాపు వారం రోజులు అవుతోంది. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా గాలింపు చర్యలు ప్రారంభించారు. మరోవైపు ప్రభుత్వం అన్వేషిస్తోంది.
సోమవారం నాడు 'ఫైండింగ్ అదితి' పేరుతో ఫేస్బుక్లో ఖాతాను తెరిచారు. ఈ నెల 24వ తేదీ నుంచి అదితి కనిపించడం లేదని, ఆ రోజున ఆమె గులాబీ రంగు గౌను, గులాబీ రంగు పాఠశాల సంచితో ఉందని, ఆచూకీ తెలిసిన వారు తప్పకుండా సమాచారం ఇవ్వగలరని అదితి బాబాయి ఫేస్బుక్లో విజ్ఞప్తి చేశారు.
అదితి తండ్రి మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని చెప్పారు.