మరో రాష్ట్ర రాజధాని నుంచి కాదు, విజయవాడ నుంచే పాలన సాగాలి: హరిబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పాలన విజయవాడ నుంచే కొనసాగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపి హరిబాబు అన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాజధానిగా ఉందని, ఈ నేపథ్యంలో మరో రాష్ట్ర రాజధాని నుంచి పాలన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
శనివారం విజయవాడలో బిజెపి రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడారు. ఈ సమావేశానికి బిజెపి మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు భారీగా కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా గ్రామ, మండల, జిల్లా, కార్పొరేషన్ స్థాయి అధ్యక్ష ఎన్నికలపై నాయకులు ఈ సందర్భంగా భారీ కసరత్తు చేయనున్నారు.
అదేవిధంగా రాష్ట్ర బిజెపికి కొత్త అధ్యక్షుడ్ని డిసెంబర్ రెండవ వారంలో ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ అంశంపై కూడా నేతలు చర్చించనున్నారు.