ఇక అమరావతి పోరులోకి బీజేపీ-అమిత్ షా సూచనతో-టీడీపీకి మైలేజ్ వ్యాఖ్య -జగన్ కు షాక్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. ఇందులో విపక్ష టీడీపీతో పాటు సీపీఐ కీలకంగా ఉన్నాయి. మిగతా పార్టీలు అవసరమైనప్పుడు వచ్చిపోతున్నాయి. దీంతో అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తోంది టీడీపీనే అనే ప్రచారాన్ని వైసీపీ తీవ్రతరం చేస్తోంది. ఇది టీడీపీకి ఒక విధంగా మంచిదే అయినా ఇతర ప్రాంతాల్లో మాత్రం నష్టం జరుగుతోంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఉద్యమానికి దూరంగా ఉండిపోవడానికి చూపుతున్న కారణం టీడీపీ దీన్ని నెత్తికెత్తుకోవడంతో పాటు తమ పార్టీలో ఉన్న కమ్మ నేతలే అనేది వారి వాదన. అయితే ఈ వాదనను అమిత్ షా తీవ్రంగా తప్పుబట్టారు.

అమరావతి ఉద్యమం
ఏపీలో వైసీపీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న అమరావతి ఉద్యమం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇందులో టీడీపీ, సీపీఐ క్రియాశీలకంగా ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ, జనసేన, ఆప్ వంటి పార్టీలు అడపాదడపా మద్దతిస్తున్నాయి. మరోవైపు అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
నిన్న మొన్నటి వరకూ అమరావతిలోనే ఉద్యమంపై ఆంక్షలు పెట్టిన పోలీసులు.. ఇప్పుడు రైతులు చేస్తున్న మహాపాదయాత్రపైనా కొరడా ఝళిపిస్తున్నారు. దీంతో అమరావతి ఉద్యమం మరింత పెరుగుతోంది. దీంతో టీడీపీ, సీపీఐ మినహా మిగిలిన పార్టీలూ పునరాలోచనలో పడుతున్నాయి.

బీజేపీ మౌనంగా అమిత్ షా ఫైర్
అమరావతి ఉద్యమానికి ఏపీ బీజేపీ పూర్తిస్ధాయిలో మద్దతివ్వకపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. రెండురోజుల పర్యటన కోసం ఏపీకి వచ్చిన అమిత్ షా.. అమరావతి ఉద్యమంపై ఈసారి సీరియస్ వ్యాఖ్యలే చేశారు. దీంతో బీజేపీ నేతలు ఒకింత షాక్ కు గురయ్యారు.
అమరావతి ఉద్యమాన్ని ఎందుకు ఓన్ చేసుకోలేకపోయారంటూ అమిత్ షా అడిగిన సూటి ప్రశ్నకు బీజేపీ నేతల వద్ద సమాధానం లేకుండా పోయింది. దీంతో బీజేపీ నేతలు తమదైన శైలిలో కారణాలు చెప్పుకొచ్చారు. ఇందులో ఒకటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన సోము వీర్రాజు వైఖరి. ఇది విన్న అమిత్ షా మరింత సీరియస్ అయ్యారు.

అమరావతికి బీజేపీ దూరం వెనుక కారణాలివేనట
అమరావతి ఉద్యమంలోకి బీజేపీ క్రియాశీలకంగా ఉండలేకపోవడానికి రాష్ట్ర నేతలు కొన్ని కారణాలు అమిత్ షాకు చెప్పారు. ఇందులో అమరావతి ఉద్యమాన్ని ముందునుంచీ టీడీపీ మోస్తుండటం, అలాగే బీజేపీలో ఉన్న కమ్మ నేతలు టీడీపీకి అనుకూలంగా ఉండటం వీటిలో ప్రధానమైనవి. ఈ కారణాలతోనే బీజేపీ అమరావతి రాజధాని ఉద్యమంలోకి రాలేకపోతోందట.
ఈ కారణాల్ని విన్న అమిత్ షాకు చిర్రెత్తుకొచ్చింది. టీడీపీ నడిపిస్తుుందన్న కారణంతో అమరావతి ఉద్యమానికి దూరంగా ఉండిపోవడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు సామాజిక ముద్రతో దూరంగా ఉంచడమేంటని నిలదీశారు. దీంతో బీజేపీ నేతలు ఇరుకునపడ్డారు.

టీడీపీకి మైలేజ్ నిర్ధారించిన అమిత్ షా
అమరావతి ఉద్యమం కారణంగా విపక్ష టీడీపీకి మైలేజ్ వచ్చిందన్న అంశాన్ని బీజేపీ నేతలతో భేటీలో అమిత్ షా నిర్ధారించారు. అలాగే టీడీపీకి మైలేజ్ వస్తుంది కాబట్టి బీజేపీ నేతలు ఈ ఉద్యమానికి దూరంగా ఉండిపోవడాన్ని కూడా తప్పుబట్టారు. ముఖ్యంగా మహిళలు దేవస్ధానానికి చేస్తున్న పాదయాత్రకు బీజేపీ దూరంగా ఉండటం ఏమాత్రం సరికాదని వారికి తెలిపారు. దీంతో బీజేపీ నేత సోము వీర్రాజు పూర్తిగా ఇరుకునపడ్డారు. ఇకనైనా అమరావతి ఉద్యమంలోకి వెళ్లాలని బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకున్నారు.

జగన్ కు అమిత్ షా వరుస షాకులు
ఓవైపు మూడు రాజధానులకు కేంద్రం మద్దతిస్తున్నట్లు పైకి చెబుతూనే మరోవైపు అమరావతి ఉద్యమంలోకి వెళ్లాలని బీజేపీ నేతల్ని అమిత్ షా ఎగదోయడం సీఎం జగన్ కు భారీ షాకిచ్చింది. ఇప్పటికే హైకోర్టులో రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని కేంద్రం చెప్పగా... ఇప్పుడు అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అమిత్ షా అమరావతి రాజధాని కోసం పోరాటం చేయాలని బీజేపీ నేతలకు సూచించడం వైసీపీని ఇరుకునపెట్టింది.
మరోవైపు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతపెరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలు సైతం జగన్ సర్కార్ కు రుచించడం లేదు. 2024 ఎన్నికలే టార్గెట్ పై వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని అమిత్ షా బీజేపీ నేతలకు సూచించడాన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఇదే ఆరంభంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications