సీఎం ప్రకటన..సొంత పార్టీ ఎమ్మెల్యే భిన్నాభిప్రాయం: సీమ నేతలు సైతం: ఆ ఎమ్మెల్యేల మౌనం వెనుక..!
ఏపీలో మూడు రాజధానులు ఉండవచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపణలకు కారణమవుతోంది. ప్రతిపక్ష పార్టీలే కాదు..సొంత పార్టీ నేతలు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఓపెన్ గా మాట్లాడుతుంటే..మరి కొందరు అంతర్గత చర్చల్లో దీనిపైన చర్చిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి భిన్నంగా స్పందించారు. అసెంబ్లీ..సెక్రటేరియట్ రెండూ కూడా ఒక్కచోటే ఉండాలని ఆకాంక్షించారు.
అదే విధంగా చిత్తూరుకు చెందిన మరో నేత చిత్తూరు ఆకాంక్షను తెర మీదకు తెచ్చారు. ఇక, అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తుంటే రాజధాని ప్రాంతంలోని రెండు నియోజకవర్గాల వైపీపీ ఎమ్మెల్యేలు మౌనం వహిస్తున్నారు. సీఎం జగన్ ప్రకటన పైన...గుంటూరు..క్రిష్టా జిల్లాల ఎమ్మెల్యేలు వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
సీఎం జగన్ భద్రతకు ఆక్టోపస్ టీమ్: మూడు రాజధానుల ప్రకటన చేసిన మరుసటిరోజే భద్రత పెంపు
గోపిరెడ్డి అభిమతం ఏంటంటే..
మూడు రాజధానులపై జగన్ వ్యాఖ్యల పైన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భిన్నంగా స్పందించారు. అసెంబ్లీ..పరిపాలన విభాగం ఒకే చోట ఉండాలని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ కూడా ఒక్కచోటే ఉండాలని ఆకాంక్షించారు.అయితే, ఈ అభిప్రాయం తన అభిమతం.. తన ఆలోచన మాత్రమే అంటూ స్పష్టత ఇచ్చారు. ఇదే అభిప్రాయాన్ని సీఎం జగన్కు కూడా తెలియజేస్తానని వెల్లడించారు.
విశాఖను ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేయాలన్నారు. కానీ ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ప్రజలు నష్టపోవడం భావ్యం కాదని వాపోయారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం సరైన నిర్ణయమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అప్పటివరకూ ప్రజలు అపోహలు పడవొద్దని సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన వ్యాఖ్యలురాజకీయంగా చర్చకు కారణమైంది.
తెర మీదకు చిత్తూరు డిమాండ్...
కర్నూలు లో హైకోర్టు నిర్ణయం పైన టీడీపీ నేతలే ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతించారు. సీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు అభినందించారు. ఇక, చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో చర్చకు కారణమయ్యాయి. అధికార..పాలన వికేంద్రీకరణ కంటే అభివృద్ధి వికేంద్రీకరణ చాలా ఉత్తమమైన మార్గమని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారపాకుల భాస్కర నాయుడు అన్నారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే చిత్తూరు జిల్లావాసులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. సచివాలయానికి వెళ్లాలంటే వెయ్యి కి.మీ, హైకోర్టుకు వెళ్లాలంటే 400 కి.మీ ప్రయాణించాలని అన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా మార్చాలని, హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, ఆర్డిక సంఘం ప్రతినిధులతో కలిసి తిరుమల వచ్చిన ఆర్దిక మంత్రి బుగ్గన ముఖ్యమంత్రి జతన్ తన ఆలోచన మాత్రమే బయట పెట్టారని..కమిటీ నివేదిక తరువాత అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు.
రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు ఎక్కడ..
అమరావతి లెజిస్టేచర్ రాజధానిగా ఉండవచ్చని..విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద అమరావతి ప్రాంతంలో స్థానికులు..రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు బంద్ నిర్వహించారు. ఆందోళన కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల తరపున పోరాటం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఈ అంశం మీద ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
అదే విధంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సైతం ముందుకు రాలేదు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు నిరసనల్లో పాల్గొంటున్నారు. కమిటీ నివేదిక..ప్రభుత్వం తుది నిర్ణయం కోసం క్రిష్టా.. గుంటూరు జిల్లాలకు చెందిన అధికార పార్టీ నేతలు వేచి చూస్తున్నారు. మంత్రి కొడాలి..సీనియర్ నేత అంబటి ఇప్పటికే సీఎం నిర్ణయనికి మద్దతు ప్రకటించారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో ఏ రకంగా స్పందిస్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఉత్కంఠ కనిపిస్తోంది. కమిటీ నివేదిక..ప్రభుత్వ తుది నిర్ణయం తరువాత వారు స్పందించే అవకాశం కనిపిస్తోంది.