రాయలసీమకు సముద్రం మచ్చా: జగన్.. తగ్గేదేల్యా
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు తెర మీదికి రానున్నాయి.

మారిన స్వరూపం..
కొత్త జిల్లాల రాకతో రాష్ట్ర స్వరూపం సమూలంగా మారిపోయింది. హద్దులన్నీ అటు ఇటు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ..కొన్ని చోట్ల పట్టువిడుపులను ప్రదర్శించింది. భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలన్నింటికీ సమదూరంలో జిల్లా కేంద్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది.

కొత్త రెవెన్యూ డివిజన్లు..
ఇందులో వచ్చిన మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని- ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్లో మళ్లీ మార్పులు చేర్పులు చేసే అవకాశాలు లేకపోలేదనే వాదన అధికార వర్గాల్లో వ్యక్తమౌతోంది. 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 15 కొత్త రెవెన్యూ డివిజన్లను ప్రకటించింది. కొత్తగా ఆవిర్భవించబోతోన్న 13 జిల్లాల్లో కొన్నింటికి.. వాటికి ఉన్న ప్రాధాన్యత ఆధారంగా పేర్లు పెట్టడాన్ని కూడా పూర్తి చేసింది జగన్ సర్కార్.

కొత్త పేర్లతో..
రాయచోటి కేంద్రంగా ఆవిర్భవించనున్న జిల్లాకు తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య పేరును పెట్టింది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాకు శ్రీ సత్యసాయిగా నామకరణం చేసింది. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తూ దానికి శ్రీవారి పేరును పెట్టింది. శ్రీబాలాజీ జిల్లాగా పిలవనుంది. పార్వతిపురం కేంద్రంగా మన్యం జిల్లాను తెరమీదికి తీసుకుని రానుంది. పాడేరు జిల్లాకు విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టింది.

విజయవాడకు ఎన్టీఆర్
అమలాపురం కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాకు కోనసీమ పేరును పెట్టింది ప్రభుత్వం. నరసరావుపేట జిల్లాకు పల్నాడు పేరును పెట్టింది. కొత్తగా మనుగడలోకి రానున్న విజయవాడ జిల్లాకు- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును పెట్టింది.

మారిన సీమ స్వరూపం..
కొత్త జిల్లాల ప్రకటనతో రాయలసీమ స్వరూపం పూర్తిగా మారిపోయింది. నాలుగు జిల్లాలుగా ఉన్న ఈ రీజియన్ ఇక ఎనిమిది జిల్లాలుగా అవతరించింది. సరిహద్దులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటిదాకా ఉన్న నాలుగు జిల్లాలు రెండుగా విడిపోయాయి. ఇప్పటిదాకా రాయలసీమ ల్యాండ్ లాక్ ప్రాంతంగా ఉంటూ వచ్చింది. అంటే నాలుగు వైపులా భూమి ఉండేది. కొత్త జిల్లాలతో సముద్రం కూడా సీమను పలకరించినట్టయింది.

కొత్తగా నాలుగు జిల్లాలు..
కొత్తగా- నంద్యాల, శ్రీబాలాజీ, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల పార్లమెంటరీ కేంద్రం పరిధి ఇక కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. ఆళ్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం దీని పరిధిలోకి వస్తాయి. కర్నూలు జిల్లాలో పాణ్యం, ఎమ్మిగనూరు, కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల వస్తాయి.

శ్రీబాలాజీ జిల్లాగా..
తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కేంద్రంగా తీసుకుని శ్రీబాలాజీ జిల్లాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి దీని పరిధిలోకి వస్తాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం కలవడం వల్ల సముద్ర తీరం కలిసి వచ్చినట్టయింది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, కుప్పం నియోజకవర్గాలతో కలిపి చిత్తూరు కొనసాగుతుంది.

అన్నమయ్య జిల్లాగా..
ప్రస్తుతం కడప పరిధిలో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసుకుని అన్నమయ్య జిల్లాను ప్రకటించింది ప్రభుత్వం. తంబళ్లపల్లి, రాయచోటి, మదనపల్లి, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు ఈ జిల్లాలోకి వచ్చాయి. కడప, పులివెందుల, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాలు పాత జిల్లాలోనే కొనసాగుతాయి. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోకి కదిరి, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిరను చేర్చింది. రాప్తాడు, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications