సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ రఘురామ పిటిషన్- కీలక అభియోగాలు-విదేశీ టూర్ వేళ
వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ ఆయన బెయిల్ రద్దు కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. సాయిరెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయాలో వివరిస్తూ సుదీర్ఘ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రఘురామ పేర్కొన్న అంశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోసం సీబీఐ కోర్టులో పోరాటం చేస్తున్న రఘురామ.. ఇప్పుడు సాయిరెడ్డిని టార్గెట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సాయిరెడ్డిని టార్గెట్ చేసిన రఘురామ
వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తొలుత సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఆ తర్వాత పార్టీలో జగన్ తర్వాత కీలకంగా ఉన్న వైసీపీ పార్టమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. ఇప్పటికే విశాఖ భూముల కేసులో సిట్ దర్యాప్తులో నిందితులతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారంటూ సాయిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన రఘురామరాజు ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు.

సాయిరెడ్డి బెయిల్ రద్దుకు రఘురామ పిటిషన్
జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రఘురామ తరఫు న్యాయవాది ఇవాళ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు అవసరమైన కారణాలను,ఆధారాలతో సహా రఘురామ వివరించారు. గత వారమే సాయిరెడ్డిపై పిటిషన్ వేస్తానని చెప్పిన రఘురామ.. చెప్పినట్లుగానే ఇవాళ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆయన్ను టార్గెట్ చేశారు.

సాయిరెడ్డిపై రఘురామ అభియోగాలివే
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణంరాజు ఇందులో దానికి తగిన ఆధారాలను కూడా సమర్పించారు. ఇందులో ఎంపీగా కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా కలిసే విజయసాయిరెడ్డి.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా చిత్రీకరించి సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని రఘురామ తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే .. జగన్ అక్రమాస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు.మరోవైపు విజయనగరం మాన్సాస్ ట్రస్ట్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలు చట్టవిరుద్ధమని హైకోర్టు కొట్టివేసిన సందర్భంలో అశోక్గజపతిరాజు దొడ్డిదారిన కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారని, ఆయన్ను జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కోర్టు ధిక్కరణే కాకుండా న్యాయవ్యవస్థ పట్ల ఆయన దృక్పథాన్ని తేట తెల్లం చేస్తోందని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

సాయిరెడ్డి విదేశీ టూర్ కు బ్రేక్ వేసేందుకే ?
వైసీపీలో జగన్ తర్వాత నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డిని రఘురామకృష్ణంరాజు టార్గెట్ చేయడం వెనుక ప్రధాన కారణాలేంటనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే తనపై అనర్హత వేటు కోరుతూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదులు చేయడం, లేఖలు రాయడం, ఆరోపణలు చేయడం వంటి చర్యలతో సాయిరెడ్డి రఘురామకు కంటగింపుగా మారారు. అదే సమయంలో జగన్ వద్ద తనపై ఫిర్యాదులు చేసి శత్రువుగా మార్చారన్న కోపం కూడా రఘురామకు ఉంది. దీంతో ఆయన విజయసాయిరెడ్డిని సరైన సమయం చూసి దెబ్బ కొడుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి విదేశీ టూర్ కు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకే రఘురామ ఈ పిటిషన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications