జగన్ కు ఇలా- స్టాలిన్ కు అలా- కరుణించిన మద్రాస్ హైకోర్టు-ఏపీలో మాత్రం
దక్షిణాదిలో రెండు కీలక రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడులో రాజకీయాలు దాదాపుగా ఒకేలా కనిపిస్తుంటాయి. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు జగన్, స్టాలిన్ ల నేపథ్యం వేరయినా, వారి పార్టీలు వేరైనా, వారిద్దరూ తీసుకునే నిర్ణయాలతో వారిద్దరి మధ్య అనివార్యంగా పోలికలు మాత్రం వచ్చేస్తుంటాయి. ఇదే క్రమంలో తాజాగా తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కార్.. సీఎం స్టాలిన్ పై గత ప్రభుత్వం నమోదు చేసిన 18 కేసుల్ని వెనక్కి తీసుకుంది. దీన్ని మద్రాస్ హైకోర్టు కూడా సమర్ధించింది. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం జగన్ పై వెనక్కి తీసుకున్న కేసుల్ని ఏపీ హైకోర్టు తిరగతోడుతోంది.
జగన్, స్టాలిన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైఎస్ జగన్, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని నడుపుతున్న స్టాలిన్ కు మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి వారే. ఇద్దరు అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త సాయం తీసుకున్నారు.
అలాగే అధికారంలోకి రాగానే తమదైన శైలిలో ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పాలనలో చాలా తేడాలున్నా స్ధూలంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నారన్న పేరును ఇద్దరూ సంపాదించుకున్నారు. అలాగే వారిపై పాత కేసుల్ని కూడా తమ ప్రభుత్వ సాయంతో ఇద్దరూ రద్దు చేసుకున్నారు.
జగన్ కేసుల్ని తిరగతోడిన హైకోర్టు
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాదాపు 15 కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఇందులో క్రిమినల్ కేసులు చాలా వరకూ ఉన్నాయి. ఈ కేసుల్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తేశారు.
సాక్ష్యాలు లేవనో, తప్పుడు కేసులనో, రాజకీయ ప్రేరేపితమనే కారణాలతో వీటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే దీన్ని తప్పుబట్టిన హైకోర్టు.. సుమోటోగా వీటిపై విచారణ జరుపుతోంది. దీంతో ప్రభుత్వం, జగన్ ఇరుకునపడాల్సి వచ్చింది.
స్టాలిన్ కేసుల ఎత్తివేతను సమర్ధించిన హైకోర్టు
తమిళనాడులో గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాలిన్ పై అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఇలాంటివే 18 కేసుల్ని నమోదు చేసింది. అన్నాడీఎంకే హయాంలో ప్రభుత్వాన్ని, సీఎంను, సీనియర్ అధికారులు, మంత్రులపై స్టాలిన్ అనేక ఆరోపణలు చేయడంతో ఆయన మీద అన్నాడీఎంకే సర్కార్ 18 పరువు నష్టం దావా కేసులు నమోదు చేసింది.
జగన్ తరహాలోనే స్టాలిన్ కూడా అధికారంలోకి రాగానే వాటిని ఎత్తేసారు. దీనిపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో స్టాలిన్ కు 18 కేసుల్లోనూ విముక్తి కలిగినట్లయింది.
Recommended Video
జగన్ కు అలా, స్టాలిన్ కు ఇలా
స్టాలిన్ విషయంలో తనపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం నమోదు చేసిన 18 పరువునష్టం కేసుల్ని ఉపసంహరించుకోవడాన్ని మద్రాస్ హైకోర్టు సమర్ధించగా.. ఏపీలో వైఎస్ జగన్ పై గత టీడీపీ సర్కార్ నమోదు చేసిన కేసుల విషయంలో మాత్రం హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోంది. దీంతో దాదాపు ఒకే తరహాలో ప్రత్యర్ధులు వీరిపై నమోదైన కేసులపై రెండు హైకోర్టులు తీసుకున్న నిర్ణయాల మధ్య పోలికతో చర్చ జరుగుతోంది.
జగన్, స్టాలిన్ కేసుల నేపథ్యం, సెక్షన్లు వేర్వేరు అయినా ఇద్దరూ ప్రత్యర్ధి ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో నమోదు చేసిన కేసుల్నే ఎదుర్కొన్నారు. ఇందులో స్టాలిన్ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్ధించిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు జగన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.