పెద్దమనిషివి అన్నావుగా.. అంత పనికిరాదు: పవన్ కళ్యాణ్కు టీజీ వెంకటేష్ కౌంటర్
Recommended Video
కర్నూలు: తనపై తీవ్ర, ఘాటు వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ బుధవారం కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా ఆవేశంతో మాట్లాడవద్దని, ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. ఉదయం జనసేన, టీడీపీ పొత్తు వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేనాని కూడా తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో టీజీ సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు.
తాము కేవలం పార్టీ కార్యకర్తలం మాత్రమేనని, పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధినేతలేనని, ఈ విషయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుంటారని టీజీ వెంకటేష్ చెప్పారు. అదే సమయంలో జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచించి మాట్లాడాలని, ఆవేశంతో మాట్లాడవద్దన్నారు.
ఎన్నికల టైంలో ఏం మాటలవి: పవన్ కళ్యాణ్తో పొత్తు, టీజీపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
ఓ పెద్దమనిషిగా పవన్ కళ్యాణ్కు ఓ సూచన
తన వ్యాఖ్యలపై జనసేనాని స్పందించారని, ఏదో మీటింగ్లో ఉండి, స్క్రోలింగ్ చూసి స్పందించారని టీజీ వెంకటేష్ అన్నారు. పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడవద్దన్నారు. పవన్ కళ్యాణ్ తనను ఉద్దేశిస్తూ పెద్దమనిషి అనే పదం ఉపయోగించారని, తాను కూడా ఓ పెద్దమనిషిగా ఆ నాయకుడికి (పవన్ కళ్యాణ్) చెప్పేది ఒకటేనని, మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా ఆలోచించి స్పందిస్తే అంత ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు.
లీడర్కు ఆవేశం పనికిరాదు
లీడర్లకు ఆవేశం పనికి రాదని టీజీ వెంకటేష్ అన్నారు. కార్యకర్తలకు ఆవేశం ఉండవచ్చునని, ప్రజలకు ఉండవచ్చునని, కానీ నాయకుడికి ఆవేశం ఉండవద్దని, ఆవేశం ఉంటే దెబ్బతింటారని హెచ్చరించారు. దానిపై ఆధారపడిన వారు కూడా దెబ్బతింటారని చెప్పారు. నేను చాలా స్పష్టంగా చెప్పానని, మేం కార్యకర్తలం, కావాలంటే నేను చెప్పిన వీడియోను మళ్లీ చూడవచ్చునని, టీడీపీ, జనసేన పార్టీలలో ఉండే కార్యకర్తలం.. పొత్తులపై నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. పొత్తులపై నిర్ణయించేది టీడీపీ తరఫున చంద్రబాబు, జనసేన తరఫున పవన్ అన్నారు. బాస్లు నిర్ణయించుకోవాలన్నారు. తమలాంటి కార్యకర్తలు నిర్ణయించరన్నారు.
నేను ఏమన్నానంటే
సహజంగా పొత్తుల అంశంపై ఎన్నికలకు ముందు చర్చలు జరుగుతాయని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ పొత్తుపై వారు నిర్ణయానికి వస్తే, సీట్ల సర్దుబాటు మార్చిలో ఉంటుందని, అని నేను చెప్పానని అన్నారు. కానీ స్క్రోలింగ్ చూసి స్పందిస్తే సరికాదన్నారు. అది నాయకుడి లక్షణం కాదన్నారు. తనను పెద్దమనిషి అని సంభోదించినందుకు గౌరవంగా నేనూ చెబుతున్నానని, మీకు భవిష్యత్తులో ఉండాలని, భవిష్యత్తులో మీరు చాలా చూడాల్సి ఉందని, మీరు నాయకత్వం వహించాలని, అలా కావాలంటే ఎవరైనా మాట్లాడింది చక్కగా విని మీరు స్పందిస్తే బాగుంటుందన్నారు. నేను మిమ్మల్ని (పవన్ కళ్యాణ్) ఎక్కడా అగౌరవపరచలేదన్నారు. నేను గౌరవించి మాట్లాడానని చెప్పారు. మీరు చూసి మాట్లాడాలన్నారు. మీకు అర్థం కాకుంటే, నా తరఫున పొరపాటు ఉందంటే నేను మళ్లీ వచ్చి మాట్లాడుతానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
అంతకుముందు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. టీజీ వెంకటేష్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని చెప్పారు. నేను వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటును తెచ్చుకున్న వెంకటేష్కు బుద్ధి చెబుతామని అన్నారు. పారిశ్రామికవేత్తగా నదులను, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పారు. పెద్దమనిషి కాబట్టి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నానని, నేను నోరు అదుపు తప్పితే మీరు ఏమవుతారో నాకు తెలియదన్నారు. కిడారి, సోమ చనిపోవడానికి కారణం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి చేస్తానని మీరు హామీ ఇస్తే నేను మద్దతిచ్చానని, దాంతో మీరు అధికారంలోకి వచ్చారని చెప్పారు.