రఘురామపై రాజద్రోహం కేసు కొనసాగింపు ? సుప్రీం తీర్పుతో-క్వాష్ పిటిషన్ ?
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్ధానం కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ షరతుల్లో ఆయన విచారణకు సహకరించాలని పేర్కొంది. తద్వారా సీఐడీ ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని చెప్పకనే చెప్పింది. దీంతో సీఐడీ ఇప్పటికే నమోదు చేసిన రాజద్రోహం కేసులో మరిన్ని ఆధారాల సేకరణకు సిద్దమవుతోంది.

రఘురామపై సుప్రీం తీర్పులో కీలకాంశాలు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఓవైపు రఘురామరాజుకు బెయిల్ ఇస్తూనే మరోవైపు సీఐడీ కస్టడీలో ఆయనకు సరైన ట్రీట్మెంట్ లభించలేదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో సీఐడీ విచారణ కొనసాగింపుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రఘురామరాజుకు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, మీడియాకు తన గాయాలు చూపొద్దని పలు సూచనలు చేసింది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలు, రఘురామరాజుకు విధించిన షరతులు కీలకంగా మారాయి.

రఘురామపై సీఐడీ విచారణ కొనసాగింపు
ఏపీ సీఐడీ దాఖలు చేసిన రాజద్రోహం కేసు ఆరోపణలపై సీఐడీ విచారణకు సుప్రీంకోర్టు తీర్పు లైన్క్లియర్ చేసింది. రాజద్రోహం ఆరోపణలు సరికాదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రఘురామరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సీఐడీ విచారణకు బ్రేక్ పడుతుందని పలువురు భావించినా అలా జరగలేదు. రఘురామరాజుకు ఓవైపు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు విచారణకు సహకరించాలని షరతు విధించింది. దీంతో రఘురామరాజుకు సీఐడీ విచారణ ఎదుర్కోక తప్పని పరిస్ధితి.

ఆధారాల సేకరణకు సీఐడీ ప్రయత్నాలు
రఘురామరాజుపై సీఐడీ మోపిన దేశద్రోహం ఆరోపణలపై మాత్రం సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వలేదు. రఘురామ చేసిన వ్యాఖ్యలపై సీఐడీ రాజద్రోహం కేసు నమోదు చేయవచ్చా లేదా అన్న అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా దర్యాప్తు కొనసాగించుకోవచ్చని చెప్పడం ద్వారా వీటిని సమర్ధించినట్లయింది. దీంతో సీఐడీ కూడా రఘురామపై మోపిన రాజద్రోహం అభియోగాలపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి రఘురామ వ్యాఖ్యలే ఆధారంగా ఉన్నందున వీటికి మద్దతుగా ఆయన ఫోన్కాల్స్, ఇతర ఆధారాల సేకరణకు సిద్దమవుతోంది.

సుప్రీంలో రఘురామ క్వాష్ పిటిషన్ ?
తనపై ఏపీ సీఐడీ మోపిన రాజద్రోహం ఆరోపణలపై సీఐడీ దర్యాప్తుకు సుప్రీంకోర్టు అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇప్పుడు రఘురామరాజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం సెక్షన్లను రద్దు చేయాలంటూ రఘురామ క్వాష్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సుప్రీంకోర్టు వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications