ఇన్ సైడర్ పోరులో టీడీపీకి క్లీన్ చిట్-జగన్ సర్కార్ కు లాస్ట్ ఛాన్స్ -దర్యాప్తు సంస్ధలకు సవాల్
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఇప్పటివరకూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తేలిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది. అటు తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా అమరావతిపై ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ పెద్దలకు ఈ తీర్పు భారీ ఊరటనిచ్చింది. దీంతో అమరావతికి మద్దతుగా టీడీపీ గట్టిగా వాయిస్ వినిపించేందుకు అవకాశం దక్కినట్లయింది. అదే సమయంలో అమరావతిలో అక్రమాల నిరూపణ దర్యాప్తు సంస్ధలకు సవాల్ కానుంది.

అమరావతికి భారీ ఊరట
అమరావతి రాజధానిగా తెరపైకి వచ్చినప్పటి నుంచీ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. అప్పట్లో రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనేశారని ఓ ఆరోపణ, రాజధానికి ప్రధాని శంఖుస్ధాపన చేసినా నిధులివ్వలేదని మరో ఆరోపణ, పేద, ఎస్సీ రైతుల భూములు లాక్కొన్నారని ఇంకో ఆరోపణ... ఇలా ఒకదాని వెంట మరో ఆరోపణలు ఎదుర్కొన్న అమరావతికి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారీ ఊరటగా మారుతోంది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట వైసీపీ కొన్నేళ్లుగా చేస్తున్న ఆరోపణలకు దీంతో చెక్ పడింది. అంతే కాదు అమరావతిలో దర్యాప్తుల పేరిట సాగుతున్న హంగామాకు కూడా చెక్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

టీడీపీకి క్లీన్ చిట్
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, పుల్లారావుతో పాటు మరికొందరు కీలక నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రభుత్వం వరుస దర్యాప్తులతో వారిని చికాకుపెట్టింది. అమరావతిలో కిందిస్దాయి నేతలు, కార్యకర్తలు, రైతుల పరిస్ధితి మరీ దారుణం.
కొన్నేళ్లుగా వారి వాదనను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చివరికి సుప్రీంకోర్టు ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్ధించడంతో టీడీపీకి క్లీన్ చిట్ లభించినట్లయింది. దీంతో టీడీపీ అమరావతికి మద్దతుగా మరింత దూకుడుగా వాయిస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమరావతి దర్యాప్తులు ఆగిపోతాయా?
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతోనే వైసీపీ సర్కార్ అక్కడ సీఐడీ, ఏసీబీ, సిట్ వంటి దర్యాప్తు విభాగాలతో విచారణలు చేయిస్తోంది. ఇందులో టీడీపీ నేతలే ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు భూములు అమ్ముకున్న రైతుల్ని కూడా ప్రభుత్వం టార్గెట్ చేసింది. భూములు అమ్ముకోవడానికి గల కారణాలు చెప్పాలంటూ వారిని పదే పదే విచారణలకు రప్పించింది. దీంతో వారి కుటుంబాలు కూడా నలిగిపోతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ, సిట్, ఏసీబీ దర్యాప్తులు నిలిచిపోయే అవకాశముంది.
Recommended Video

జగన్ సర్కార్ కు చివరి అవకాశం
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో క్షేత్రస్దాయిలో నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సాగిస్తున్న దర్యాప్తుల్ని నిలిపేయాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీంతో ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ మినహాయించి మిగిలిన ఆర్ధిక వ్యవహారాలు, లావాదేవీలపైనే వైసీపీ సర్కార్ దృష్టిపెట్టబోతోంది.
ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారు పెద్ద ఎత్తున భూముల క్రయ విక్రయాల్లో పాల్గొన్నారన్న ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చే అవకాశముంది. వీటిపై ఇప్పటికే దర్యాప్తు సాగుతున్నా తగిన ఆధారాలు లభించలేదు. ఇప్పుడు వీటిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి ఆరోపణల్ని నిరూపించాల్సి ఉంటుంది. అందులోనూ విఫలమైతే ఇక జగన్ సర్కార్ కు లాస్ట్ ఛాన్స్ కూడా మిస్సయ్యే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications