టీటీడీ ఛైర్మన్ నివాసానికి అఘోరాలు.. మరో నేత ఇంట్లోనూ..సోషల్ మీడియాలో హల్ చల్..!!
హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకునే అఘోరాలు ఏపీలో దర్శన మిచ్చారు. అందునా రాజకీయ ప్రముఖల నివాసాల్లో కనిపించారు. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో అఘోరాలు రావటం..వారికి సుబ్బారెడ్డితో పాటుగా కుటుంబ సభ్యులు ఆశీర్వాదం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. సుబ్బారెడ్డి తో పాటుగా బీజేపీ మాజీ ఎంపి గోకరాజు గంగరాజు నివాసంలోనూ అఘోరాలు కనిపించారు.
వారిని తమ నివాసానికి ఆహ్వానించిన గంగరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శన మిస్తున్నాయి. దీని పైన ఇప్పటి వరకు అధికారికంగా స్పందించ లేదు. వారు ఎప్పుడు వచ్చారు. ఈ ఫొటోలు ఎప్పుడనేవి క్లారిటీ లేదు. అయితే, వారిని హిమాలయాల నుండి ప్రత్యేక ఖర్చులతో తమ నివాసాలకు తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది.
వైవీ సుబ్బారెడ్డి సైతం గతంలో లోక్ సభ సభ్యుడిగా పని చేసారు. అదే సమయంలో గోకరాజు గంగరాజు సైతం బీజేపీ సభ్యుడిగా ఉండేవారు. ఇద్దరికీ దైవ భక్తి ఎక్కవే. దీని కారణంగానే వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల కోరిక మేరకు చిన్నాన్నను టీటీడీ ఛైర్మన్ గా నియమించారు. ఎన్నికల సమయంలో టిక్కెట్ ఇవ్వటం లేదనే విషయం తెలిసి కొద్ది రోజులు సుబ్బారెడ్డి అలక వహించారు. ఆ తరువాత అధికారంలోకి రాగానే కీలక పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.
అదే విధంగా ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వటంతో పాటుగా అక్కడ నిర్ణయాల పట్ల స్వేఛ్చ ఇచ్చారు. ఆయన నియామకం పైన కొంత మంది సుబ్బారెడ్డి మతం పైన అసత్యాలు ప్రచారం చేసారు. దీనిని సుబ్బారెడ్డి ఖండించారు. టీటీడీ ఛైర్మన్ గా ఆయన రుషికేష్ లో ఉన్న స్వరూపానంద సరస్వతిని సైతం కలిసి కొద్ది రోజుల క్రితం శ్రీవారి ప్రసాదం అందచేసారు.
Recommended Video
అయితే..ఇప్పుడు సుబ్బారెడ్డి ఇంటికి హిమాలయాల నుంచి అఘోరాలు విచ్చేయడం సంచలనంగా మారింది. సుబ్బారెడ్డి.. గంగరాజు ఇద్దరూ తమ నివాసాలకు ఈ అఘోరాలను ఆహ్వనించటం.. పూజలు నిర్వహించటం పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. దీని పైన సోషల్ మీడియాలో చర్చ నీయాంశంగా మారింది.