బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సవాలుకు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి ప్రతిసవాలు
నెల్లూరు:రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని రైతుల కోసం కేంద్రం ఎంత ఖర్చుపెట్టింది...అలాగే ఇదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర పెట్టిన ఖర్చు వివరాలు కూడా వెల్లడించాలని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల రుణమాఫీ తో సహా జొన్న, మొక్కజొన్న, మిరప, పసుపు, మామిడి పంటలకు మద్దతు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసిందో...ఏమి సాయం చేసిందో చెప్పాలన్నారు. ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రైతుల కోసం ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్న డిమాండ్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిస్పందించారు.

కన్నా సవాలు...స్పందించిన సోమిరెడ్డి
ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం టిడిపి ప్రభుత్వం ఏం చేసిందో చంద్రబాబు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో కన్నా వ్యాఖ్యలపై వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిస్పందించారు. ఇదే విషయమై ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎపి రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలని సోమిరెడ్డి ప్రతి సవాలు విసిరారు. ఎపి విభజన జరిగాక కేంద్రం రాష్ట్రంలోని రైతలకోసం చేసిన ఖర్చు...అదే సమయంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం చేసిన ఖర్చు వివరాలు బైటకు వెల్లడించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

ఎపి ప్రభుత్వం...ఇవి చేసింది
దేశం మొత్తం మీద రైతులకు స్వయం పోషకాలను నూరు శాతం సబ్సిడీతో అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనేనని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. ఏపీఎంఐపీకి రాష్ట్రంలో రూ.1,380 కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం ఉండాలయితే...అది 30 శాతానికి పడిపోయిందని...మిగిలినవన్నీ రాష్ట్ర నిధులే అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. కన్నా లక్ష్మీ నారాయణ తెలిసీ తెలియక బాధ్యత లేకుండా మాట్లాడటం తగదని మంత్రి సోమిరెడ్డి హితవు పలికారు. అయినా తెలియని వారికీ చెప్పగలం...తెలిసిన వారికీ చెప్పగలం...తెలిసీతెలియని వారికి ఏమి చెప్పలేమని ఎద్దేవా చేశారు. అయినా ఏమైనా సందేహాలుంటే అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలను ప్రశ్నలు వేయమనండి..అధికారికంగా అన్ని వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

ఎపిలో రక్షణ లేదా?...ఆ సంగతి చూసుకోండి
ఏపీలో మహిళలకు రక్షణ లేదనడం సరికాదన్నారు...మోదీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఏపీలో టీడీపీ హయాంలోనే శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని...రాష్ట్రంలో మతకల్లోలాలు లేకుండా చేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. మోదీ, అమిత్ షాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోతోందని...దు ఆ సంగతి చూసుకోండని ఎద్దేవా చేశారు. దేశంలో పలు చోట్ల ఉప ఎన్నికల ఫలితాలను చూసి బెదిరిపోయి ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నది మీరేనన్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను ఎదుర్కోలేమనే ఆలోచనలో ఉన్నది మీరేనన్నారు.
Recommended Video


ఎదురొడ్డాం...కొందరి లాలూచీ
మీ నియంతృత్వ పాలనకు ఎదురొడ్డి నిలిచిన మొదటి నేత మా చంద్రబాబేనని మంత్రి సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కొందరు మీతో లాలూచీ రాజకీయాలు చేస్తూ కాళ్లబేరాలు చేస్తున్నారన్నారు. "మా మీద ఏ కేసులు లేవు...మాకు అలాంటి రాజకీయాలు అవసరం లేదు..మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..
.తెలుగువారికి మీరు చేసిన అన్యాయం ప్రభావం వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మీపై చూపబోతోంది..
.వ్యవసాయం, విద్య, వైద్యం..ఇలా ఏ రంగాన్ని చూసుకున్నా ఏపీని ప్రశ్నించే పరిస్థితి ఉందా?...చెప్పమనండి...గత పదేళ్లకు, ప్రస్తుత నాలుగేళ్ల పాలనలో చూసుకుంటే ఏ రంగంలోనైనా మూడు, నాలుగురెట్లు ఎక్కువ ఖర్చుపెట్టాం..
.కొందరు రాష్ట్ర నాశనం కోరుకుంటున్నారు..వర్షం వస్తే బాధపడిపోతారు...కృష్ణా జలాలు వస్తే కుమిలిపోతారు..
.వారి ధ్యాసంతా కుర్చీలో కూర్చోవడంపైనే"...అని సోమిరెడ్డి దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications