ఏపీకున్నారు, ఇక్కడొద్దా: ప్రభుత్వంపై అక్బర్ అసహనం
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ సమస్యపై జరిగిన తీర్మానం కానీ, ప్రభుత్వం తరపున జారీ చేసిన ప్రకటన కానీ ఉర్దూలో అందించలేదని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. సోమవారం నాటి ఈ వివరాలను మంగళవారం కూడా అందించలేకపోయారన్నారు.
ఆంగ్లంలో గానీ ఉర్దూలోగానీ అందించలేదని, తర్జుమా చేసే వారు లేరా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో ఉర్దూ ట్రాన్స్లేటర్గా ఉన్న వారిని అవసరంలేని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశారని అక్బర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉర్దూ మాట్లాడే వారున్నా, ట్రాన్సులేటర్ లేరని, ఏపీలో ఉర్దూలో మాట్లాడే ఎమ్మెల్యే లేకపోయినా అక్కడ ఉన్నారన్నారు. కాగా, ఆ సమాచారాన్ని ఉర్దూలో తర్జుమా చేయిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
కాగా, బుధవారం శాసన సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. విద్యుత్ పరిస్థితి కన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పైన రూ.29వేల రుణభారం ఉందని చెప్పారు.
రాష్ట్రంలో అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నామన్న లెక్కలను బడ్జెట్లో చూపలేదని చెప్పారు. ఉద్యోగుల పంపిణీలో కమల్ నాథన్, ప్రత్యూష్ సిన్హా కమిటీలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధనకు కేంద్రం పైన ఒత్తిడి తేవాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన అక్బరుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి నాలుగు నెలలయినా ఏమాత్రం ఆదాయం పెరగలేదన్నారు. అయినా ఆర్థికమంత్రి ఇంత ఆశావాహక బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారో? తనకు ఆర్థకావడం లేదన్నారు. విభజన తరువాత ఇప్పటికీ వక్ఫ్ నిధులు రెండు రాష్ట్రాలకు కేటాయించలేదని, ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.