ప్లీజ్ నచ్చజెప్పండి: నారాయణకు అఖిల ఫోన్, 'భ్రమల్లో పెట్టి ఇదా మీరు చేసేది?'
మంత్రి అఖిలప్రియ సీపీఐ నారాయణకు ఫోన్ చేసి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు.
Recommended Video
విజయవాడ: కృష్ణా నదిలో చోటు చేసుకున్న బోటు ప్రమాదం సీపీఐ నేత నారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో నారాయణ బంధువులు ముగ్గురు చనిపోవడం ఆయన కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది.
22కి చేరిన మృతుల సంఖ్య: 'భయం వద్దు.. నేనున్నా'.. ఆసుపత్రిలో బాబు ఇలా!
ఆదివారం నాడు ఈ దుర్ఘటన జరగ్గా.. ఆ సమయంలో నారాయణ పాట్నాలో ఉన్నారు. సీఎం కార్యాలయం అధికారులు, పర్యాటక మంత్రి అఖిలప్రియ ఫోన్ చేసి సమాచారమందించారు.
నారాయణ బంధువులు
నారాయణ బావమరిది పోవూరి లక్ష్మీ బాపారావు కుమారుడు ప్రభుకిరణ్. ఈయన విజయవాడ బందరు రోడ్డులో నివాసముంటున్నారు. బాపారావు సోదరి వసుమతీదేవి నారాయణ భార్య. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రభుకు భార్య హరిత(30), కుమార్తె హస్విక(7) ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని కురుగొండ్ల వీరి స్వస్థలం. ఆదివారం నాటి దుర్ఘటనలో హరిత, హస్విక దుర్మరణం పాలయ్యారు.
హస్విక మారాం చేయడంతో:
నెల్లూరులో ఉంటున్న తల్లిని కొద్దిరోజుల క్రితమే తన వద్దకు పిలిపించుకుంది హరిత. అలాగే అత్తగారైన ప్రభు తల్లి లలితాదేవి(56), బంధువులు బొల్లినేని కుమారి, కుడితపూడి సుగుణమ్మ, ఈశ్వరమ్మ, దారపనేని విజయశ్రీ కూడా ఇంటికి వచ్చారు. ఆదివారం సెలవు కావడంతో బయటకు వెళ్దామని కుమార్తె హరిత మారాం చేసింది.
హస్విక మారాం చేయడంతో అందరూ కలిసి పవిత్ర సంగమం వద్దకు వెళ్లి బోటెక్కారు. అనుకోని దుర్ఘటనలో అంతా నదిలో గల్లంతయ్యారు. విజయమ్మతోపాటు కొందరు మాత్రం సురక్షితంగా బయటపడగలిగారు. లలితాదేవి, హరిత, హస్విక గల్లంతయ్యారు. లలితాదేవి, హరిత మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీశాయి. హస్విక ఆచూకీ మాత్రం తెలియాల్సి ఉంది.
నారాయణకు అఖిల ఫోన్
హస్విక మృతదేహం లభ్యం కాకపోవడతో.. ఆమె మృతదేహం దొరికేవరకు లలితాదేవి, హరితల మృతదేహాలను కూడా తీసుకెళ్లేది లేదని బంధువులు తెగేసి చెప్పారు. దీంతో మంత్రి అఖిలప్రియ సీపీఐ నారాయణకు ఫోన్ చేసి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. వారికి నచ్చజెప్పి మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా కోరారు. చిన్నారి హస్విక మృతదేహం దొరకగానే తానే దగ్గరుండి స్వయంగా ఇంటికి చేరుస్తానని హామి ఇచ్చారు. దీంతో నారాయణ తమ బంధువులకు నచ్చజెప్పారు. ఆపై వారి మృతదేహాలను గూడూరుకు తరలించినట్టు తెలుస్తోంది.
భ్రమల్లో పెట్టిన ప్రభుత్వం
బోటు ప్రమాదంపై నారాయణ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ప్రభుత్వ అజాగ్రత్త వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వం బోట్లకు అనుమతించి ఉంటే అందుకు జాగ్రత్తలు తీసుకోవలసిందని,ఒకవేళ అనుమతి లేకుండా బోట్లు తిరిగినా.. దానికి కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.
'సింగపూర్, మలేసియాలాగా టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలను భ్రమల్లో పెడుతున్నారని', జాగ్రత్తలు మాత్రం గాలికొదిలేశారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు.