నాగార్జునసాగర్ లో ఆందోళనకరంగా నీటి నిల్వలు.. తెలంగాణాకే కాదు, ఏపీకి నీళ్ళగండం!!
ప్రస్తుతం భారతదేశంలోని అనేక రాష్ట్రాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. నైరుతిలో కురిసిన వర్షాలు తక్కువగా ఉండడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడం, పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితలంపై ఉన్న నీరు వేడెక్కి ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం భారతదేశంలో కరువు ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ హెచ్చరించడం మనకు తెలిసిందే.
అయితే ఇటీవల కర్ణాటకలోని విపరీతమైన నీటి ఎద్దడి పరిస్థితులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా, నీటి ఎద్దడి కొనసాగుతుందని, భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, రైతులందరూ సమిష్టిగా కరువుపై పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం కూడా తెలిసిందే. ఇదే సమయంలో మరో వార్త ఇప్పుడు అందరిని ఆలోచించేలా చేస్తుంది. నాగార్జునసాగర్ లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారాయని తెలుస్తుంది.

నాగార్జున సాగర్ లో పూర్తిస్తాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 514.50 అడుగుల మేర నీరు ఉంది. వేసవి ఆరంభంలోనే నీటి నిల్వలు తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ నుంచి ఎలాంటి ఇన్ ఫ్లో లేకున్నప్పటకీ వివిధ అవసరాల నిమిత్తం 11,793క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం వినియోగిస్తున్న పరిస్థితి ఉంది.
ఇందులో ఏపి తాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువ ద్వారా 3031 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఎసెల్బిసి ద్వారా మరో 900 క్యూసుక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక సాగర్ ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 7862క్యూసెక్కుల నీటికి సమానమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం లో కూడా నీటి నిల్వలు అడుగంటుతున్నాయి.
శ్రీశైలం పూర్తిస్ధాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 812.70 క్యూసెక్కుల నీరు నిల్వఉంది. ఎండాకాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ముందు ముందు నాగార్జునసాగర్, శ్రీశైలం లలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతుందని, ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నీళ్ల కోసం తండ్లాడాల్సిన పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం అవుతుంది .












Click it and Unblock the Notifications