కెనడాకు ఉడాయించే యత్నం: చిక్కిన అలేఖ్య
చిత్తూరు: చిత్తూరులోని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బీమా కంపెనీలో ఖాతాదారుల సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న అకౌంటెంట్ అలేఖ్య (24) పోలీసులకు చిక్కింది. కెనడాకు ఉడాయించే ప్రయత్నంలో ఉన్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీమా సొమ్ము చెల్లించిన దాదాపు పది మంది బీమా సొమ్ము రూ.31 లక్షలు కాజేసిన విషయంపై బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటికప్పుడు సిఐ సూర్యమోహనరావు స్పందించి బుధవారం ఉదయానికే నెల్లూరు జిల్లాలోని అలేఖ్య స్వగ్రామానికి చేరుకున్నారు. అలేఖ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వర రావు (55), రాజ్యలక్ష్మి (50)లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించి అరెస్టు చేశారు.
ఖాతాదారులు చెల్లించిన రూ.31 లక్షల నగదును అలేఖ్య తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా తన తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. ఏ రోజుకారోజు అలేఖ్య జమ చేసే నగదును తల్లిదండ్రులు బ్యాంకు నుంచి డ్రా చేస్తూ వచ్చారు. జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన ఐసిఐసిఐ బీమా కంపెనీ ప్రతినిధులు అలేఖ్య తల్లిదండ్రుల ఖాతాల్లో ఉన్న నగదను స్తంభింపజేయాలని నెల్లూరులోని బ్యాంకు అధికారులను కోరారు. దాంతో అలేఖ్య తల్లిదండ్రులు రూ.2 లక్షుల మాత్రమే విత్ డ్రా చేయగలిగారు.
అలేఖ్య తండ్రి ఆర్టీసిలో పనిచేస్తున్నాడు. ఇతను కొంత కాలంగా మెడికల్ లీవులో ఉన్నాడు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన చిత్తూరు పోలీసులకు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. గత నెల 23వ తేదీన కుంభకోణం వెలుగు చూసింది. అదే నెలలో అలేఖ్య ఉద్యోగానికి రాజీనామా చేసింది.
ప్రణాళిక ప్రకారమే అలేఖ్య ఆ కుంభకోణానికి పాల్పడినట్లు అర్థమవుతోందని పోలీసులు అంటున్నారు. అలేఖ్య తన తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, వెంకటేశ్వర రావులతో కలిసి కెనడానికి వెళ్లడానికి పాస్పోర్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పాస్పోర్టు రావడం కాస్తా ఆలస్యం కావడంతో వారు పోలీసులకు దొరికిపోయారు.
వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మిలపై చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు వారిని చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిపల్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.