ముస్లింలకు టోపీలు..: రాజకీయాలపై నటుడు అలీ సంచలన ప్రకటన
ఎన్నికల్లో ముస్లింల ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ పార్టీలు హామీలు నెరవేర్చకుండా ముస్లింలకే టోపీలు పెడుతున్నాయని ప్రముఖ సినీనటుడు ఆలీ విమర్శించారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో ‘జాగో ముస్లిం..
గుంటూరు: ఎన్నికల్లో ముస్లింల ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ పార్టీలు హామీలు నెరవేర్చకుండా ముస్లింలకే టోపీలు పెడుతున్నాయని ప్రముఖ సినీనటుడు ఆలీ విమర్శించారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో 'జాగో ముస్లిం... చలో గుంటూరు' పేరుతో తలపెట్టిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రానున్న 2019 ఎన్నికల్లో ఏ పార్టీలు ముస్లిం మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇస్తాయో ఆ పార్టీకే ముస్లింలు ఓట్లు వేయాలని అలీ పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులకు రంజాన పర్వదినానే ముస్లిం మైనార్టీలు కనిపిస్తారని విమర్శించారు. రాజకీయ నేతలు టోపీలు పెట్టుకుంటూ ముస్లింలకు కూడా టోపీలు పెడుతున్నారన్నారు.బలవంతపు మత మార్పిడులు మంచిది కాదన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైదరాబాద్లోని మక్కామసీదు తరహాలో షాహీమసీదు, షాదీఖానా ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ చెప్పారు.ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ముస్లింలకు సెక్యూరిటీ లేకుండా వడ్డీలేని రుణాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
ముస్లింల సహనాన్ని రాజకీయపార్టీలు పరీక్షించవద్దన్నారు. ముస్లింలంతా ఏకమై సమస్యలు పరిష్కరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని అన్నారు. కొన్ని రాజకీయశక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని, అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి అన్నారు.
త్వరలో ముస్లింగర్జన నిర్వహించి ముస్లిం మైనార్టీల సత్తాను రాజకీయ పార్టీలకు తెలియజేస్తామని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఫీ చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మైనార్టీ మంత్రి లేకపోవటం బాధాకరమని ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఖాజావలి అన్నారు.