తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు: శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద..!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సాధారణ స్థితిలో కొనసాగుతోంది. ఆదివారం నాడు 73,801 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 23,055 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.72 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
ప్రస్తుతం భక్తులు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లల్లో వేచి ఉండట్లేదు. రద్దీ పెద్దగా లేనందున నేరుగా క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మున్ముందు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

నేడు తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా జరుపుతున్నారు.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవలను నిర్వహించారు. అనంతరం శుద్థి కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారు జామున 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు.
ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా మలయప్పస్వామివారు ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. ఆ తరువాత పంచాగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది.
టీటీడీ ఆగమ పండితులు, అర్చకులు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని నేడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అష్ట దళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు రద్దయినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications