సహద్యోగి కారులో భార్య...ప్రశ్నించినందుకు భర్తపై హత్యాయత్నం:ఇద్దరు వీఆర్ఓల అరెస్ట్
నెల్లూరు:వివాహేతర సంబంధం ఆరోపణల నేపథ్యంలో భర్తపై హత్యాయత్నం చేయించిన మహిళా విఆర్వో, ఆమె సహోద్యోగి అయిన మరో విఆర్వో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన సుష్మ, ఉడ్హౌస్పేటకు చెందిన తిరుపతిరావు ఏడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. విఆర్వోగా పనిచేస్తున్న సుష్మ ప్రస్తుతం జెండాదిబ్బలో విధులు నిర్వహిస్తోంది. అయితే ఈ భార్యాభర్తల నడుమ 4 నెలల క్రితం గొడవలు తలెత్తడంతో భర్త తిరుపతిరావుపై సుష్మ బుచ్చిరెడ్డిపాళెం పోలీస్స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు భర్త తిరుపతిరావు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 24 వ తేదీ సాయంత్రం తిరుపతిరావు తన స్నేహితుడి మురళీతో కలిసి బుచ్చిరెడ్డిపాళెం నుంచి ఉడ్హౌస్పేట కు తిరిగి వస్తుండగా దారిలో దువ్వూరు వద్ద తరుణవాయి వీఆర్ఓ రామకృష్ణారెడ్డి కారులో తన భార్య సుష్మ కలసి వెళుతుండటం చూశాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని భావించిన తిరుపతిరావు కారు ను ద్విచక్ర వాహనంతో కారును అధిగమించి వారిని ఆపాడు. మీరిద్దరు ఎక్కడ నుంచి వస్తున్నారని, ఎక్కడకు వెళ్లావని భార్య సుష్మను ప్రశ్నించడంతో ఆమె ఆగ్రహం చెందింది.
దీంతో భర్త తిరుపతిరావును కారుతో ఢీకొట్టమని తోటి విఆర్వో అయిన రామకృష్ణారెడ్డిని రెచ్చగొట్టింది. ఆ ప్రకారమే అతడు తన కారుతో సుష్మ భర్త తిరుపతిరావు బైక్ను కారుతో ఢీకొట్టాడు. కారుతో తన బైక్ ను ఢీ కొట్టడంతో గాయపడిన తిరుపతిరావు సంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విఆర్వో అయిన తన భార్య సుష్మ తోటి విఆర్వోతో కలసి హత్యాయత్నం చేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు మేరకు పోలీసులు ఇద్దరు వీఆర్ఓల పై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయడంతో పాటు నిందితులైన ఇద్దరు విఆర్వోలు సుష్మ, రామకృష్ణారెడ్డి లను అరెస్ట్ చేశారు.