మాకు చనిపోయేందుకు అనుమతివ్వండి: రాష్ట్రపతికి రాజధాని రైతుల ఆవేదన, జగన్ మాట తప్పారంటూ..
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని కోసమే తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చామని ఇప్పుడు తమకు అన్యాయం చేస్తే ఎలా బతకాలంటూ ప్రశ్నిస్తున్నారు. తాము గత సీఎం చంద్రబాబు నాయుడు కోసం భూములు ఇవ్వలేదని.. రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వానికి భూములు ఇచ్చామని స్పష్టం చేస్తున్నారు.

చనిపోయేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్రపతికి లేఖ
ఈ నేపథ్యంలో రైతులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. మంగళవారం మరో అడుగు ముందుకేసి.. తమకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు భూములిచ్చిన రాజధాని రైతులు లేఖలు రాశారు. రాజధాని విషయంలో మోసపోయినందున తమకు చనిపోయే అవకాశం కల్పించాలంటూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

జగన్ నిర్ణయంతో రోడ్డునపడ్డాం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో ఉన్నపళంగా తాము రోడ్డున పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు వినిపించుకునే వారేలేరని.. న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

జగన్ మాట తప్పారు..
గతంలో రాజధానిగా అమరావతిని అంగీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మాటమార్చారని రైతులు వాపోయారు. తమ త్యాగాన్ని అధికార వైసీపీ నేతలు హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తమ కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. శ్మశానం, ఎడారి అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక, ఆ పార్టీ నేతలను ప్రశ్నించే వారిపై దాడులు కూడా దిగుతున్నారని తెలిపారు.

కొందరి నేతల స్వార్థం.. మాకు మరణమే శరణ్యం..
సీఎం, కొందరు నేతల స్వలాభం కోసమే రాజధానిని విశాఖపట్నంకు తరలించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని తరలిపోతే తాము జీవిచ్ఛవాలుగా మిగిలిపోతామని.. ఈ బతుకులు కంటే.. మరణమే శరణ్యమని రాష్ట్రపతికి రాసినట్లు వెల్లడించారు. తమకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే తమపై కక్ష కట్టి తమను అణచివేస్తోందని రాజధాని ప్రాంత రైతులు తమ ఆవేదనను రాష్ట్రపతి రాసిన లేఖలో తెలియజేశారు.












Click it and Unblock the Notifications