బాబు మనసులో ఏముంది: చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యామ్నాయ కూటమి?
కేంద్రంపై చంద్రబాబు కన్నెర్ర చేశారా..? బీజేపీని స్ట్రాంగ్గా టార్గెట్ చేశారా..? అందుకోసం పావులు కదుపుతున్నారా..? వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా మరో శక్తి చాలా సైలెంట్గా ఎదుగుతోందా..? అంటే దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతేకాదు ఈ కూటమికి ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చూస్తే బీజేపీని కసిగా పాతాళానికి అనగదొక్కాలనే యోచనలో బాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో ప్రత్యామ్నాయానికి పావులు కదుపుతున్న బాబు
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. ఆయన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి లేకుండానే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కు ప్రత్యామ్నాయంగా మరో కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. అంతేకాదు ఇందుకోసం తానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్లు కూడా చంద్రబాబు చెప్పారు. అంతేకాదు ప్రజలు మోడీ సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారని ఎవరూ ఆయన ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదని చెప్పిన చంద్రబాబు... రానున్న 2019 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి లేకపోయినప్పటికీ మరో ప్రత్యామ్నాయ కూటమి కేంద్రంలో శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పారు.
కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
"ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించకున్నప్పటికీ ప్రత్యామ్నాయ శక్తి కి ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని చంద్రబాబు చెప్పారు. ఒక సాధారణ బాధ్యత గల పౌరుడిగా తాను తన ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు అన్నారు. కూటమి ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలోనే జేడీఎస్ నేత కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చలు జరిపినట్లు చంద్రబాబు వెల్లడించారు. అయితే కూటమిలు ఒక్కరాత్రిలో పుట్టవని చెప్పిన చంద్రబాబు గతంలో కూడా ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల తర్వాత కొన్ని కూటములు తెరపైకి వచ్చిన సంగతిని గుర్తుచేశారు. ఆ సమయంలో ఎవరూ ప్రధాని అభ్యర్థిని ఊహించలేదని చెప్పారు.
ప్రధాని అభ్యర్థి ముందే ప్రకటిస్తే ఇబ్బందులు
ప్రధాని అభ్యర్థి ఎంపిక పలు అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తామని.. ఎన్నికలకు ముందే ప్రకటిస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశముందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందరి ఏకాభిప్రాయంతోను అన్ని విషయాలు చర్చించాకే ప్రధాని అభ్యర్థి ప్రకటన ఉంటుందన్నారు. అది ఎన్నికల ముందే జరిగితే చాలా బాగుంటుందన్న అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేశారు. ఇక ప్రధాని అభ్యర్థిగా మిమ్మలను ప్రతిపాదిస్తే బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు తాను ఎప్పటికీ కేంద్రానికి వెళ్లబోనని తనకు రాష్ట్రమే ముఖ్యమని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పిన చంద్రబాబు ఆనాడు ఎన్డీఏ, యూపీఏలతో కూడా ఉన్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అంత దుర్భర పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని... ఎన్డీఏ సర్కార్ విధానాలతో ప్రజలు విసిగెత్తి పోయారని చెప్పారు.
రాఫెల్ ఒప్పందంపై ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలి
డీమోనెటైజేషన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని చెప్పుకొచ్చిన చంద్రబాబు నల్లధనం తీసుకొస్తానని చెప్పిన మోడీ ఇప్పటి వరకు ఒక్క పైసా తీసుకురాలేదని మండిపడ్డారు. ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోతోందన్నారు. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి బడా బాబులు దేశం విడిచి పారిపోయారని గుర్తు చేశారు చంద్రబాబు. ఇంధన ధరలు పెరిగాయి, రూపాయి విలువ పతనం అవుతోంది, దిగుమతి వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నాయి..వీటన్నిటినీ నియంత్రించడంలో మోడీ సర్కార్ విఫలమైందని చంద్రబాబు చెప్పారు. ఇక రాఫెల్ ఒప్పందంపై ప్రధాని నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ప్రజలకు ఒప్పందం గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడైన ప్రజల్లో మీమాంస నెలకొంటే దాన్ని నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పారు.