అమరావతిలో జగన్ ఆపరేషన్ సక్సెస్.. ప్రతికూల పరిస్ధితుల్లో గొప్ప ఊరట...
ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా జరుగుతున్న ఉద్యమానికి పోటీగా వెనుకబడిన వర్గాలతో ప్రారంభమైన ఉద్యమం సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. మూడు రాజధానులతోనే సామాజిక న్యాయం డిమాండ్ తో సాగుుతున్న ఈ ఉద్యమాన్ని విమర్శించేందుకు సైతం విపక్షాలు సాహసించడం లేదు. అదే సమయంలో పోటీ ఉద్యమం రాకతో గతంతో పోలిస్తే అమరావతి ఆందోళనలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కూ పెద్ద ఊరట లభించినట్లయింది.
అమరావతి ఉద్యమం- పోటీ ఉద్యమం
ఏపీలో అధికార వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో మొదలుపెట్టిన అమరావతి ఉద్యమం దాదాపు 90 రోజులకు చేరుకుంటోంది. ఇందులో రాజధాని గ్రామాలకు చెందిన పలువురు స్ధానికులు, రైతులు పాల్గొంటున్నారు. వీరికి మద్దతుగా విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు ఇక్కడికి చేరుకుని సంఘీభావం ప్రకటిస్తున్నారు.
దీంతో రోజూ వెలగపూడి సచివాలయానికి వెళ్లే మార్గంలో సీఎం జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల భద్రత కూడా ప్రమాదంలో పడుతోంది. సీఎం జగన్ వెళ్లే సమయంలో పోలీసులు భారీగా మోహరించడంతో పాటు ఆంక్షలు కూడా విధిస్తున్నారు. రాష్ట్రంలోని వివిద ప్రాంతాల్లో మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనలు చేయిస్తున్న వైసీపీ ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆ పని చేయడానికి చాలాకాలమే పట్టింది.
పోటీ ఉద్యమం రాకతో...
ఇలాంటి తరుణంలో అమరావతి ఉద్యమానికి పోటీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన పార్టీ నేతలు, స్దానికులతో జగన్ సర్కారు పోటీ ఉద్యమానికి తెరలేపింది. ఎక్కడా ప్రభుత్వం పేరు కానీ, పార్టీ పేరు కానీ ఎత్తకుండానే అమరావతి ఉద్యమానికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత వారం ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తొలుత రాజధానిలో ఇళ్ల స్ధలాల పేరుతో ప్రారంభమైన బహుజన పరిరక్షణ సమితి ఉద్యమం తాజాగా మూడు రాజధానులకు మద్దతు వాదనను నెత్తికెత్తుకుంది. మూడు రాజధానులతోనే రాష్ట్రంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందనే డిమాండ్ ను ఇప్పుడు పోటీ ఉద్యమం వినిపిస్తోంది.
రాజధానికి రావడం మానేసిన నేతలు..
పోటీ ఉద్యమం రాక నేపథ్యంలో అప్పటివరకూ రాజధానిలోనే కనిపించిన విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు ఇప్పుడు ఇక్కడకు రావడం మానేశారు. రాజధానిలో పోటీ ఉద్యమంలో పాల్గొంటున్న వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు కావడంతో వారిని ఎదుర్కోవడం లేదా వారితో వాగ్వాదానికి దిగితే విమర్శలు తప్పవని భావించి నేతలంతా ఇక్కడికి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. అలాగే దీంతో సహజంగానే అమరావతి ఉద్యమం కళ తప్పింది. పొరుగు నేతల రాక తగ్గడంతో అమరావతి గ్రామాల్లోనూ రైతులు స్ధానికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్లను దాటి బయటకు రావడం మానేశారు.
జగన్ వ్యూహం సక్సెస్... బిగ్ రిలీఫ్
నిన్న మొన్నటి వరకూ అమరావతి గ్రామాల మీదుగా సచివాలయం వెళ్లాలంటే దారి పొడవునా పోలీసుల మోహరింపు కనిపించేది. ఇప్పుడు అక్కడ కంటే బహుజన పరిరక్షణ సమితి చేస్తున్న ఉద్యమం పరిసరాల్లోనే ఎక్కువ పోలీసులు కనిపిస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి వెళ్లే నేతలపై ఆగ్రహంతో ఉద్యమకారులు ఎక్కడ దాడులు చేస్తారేమోనన్న భయంతో పోలీసులు వారి టెంట్ల వద్దే కాపలా కాస్తున్నారు. రాజధాని గ్రామాల ప్రజల నుంచి కూడా వీరికి దాడుల ముప్పు పొంచి ఉండటంతో పోలీసు భద్రత పెంచారు. చివరికి సీఎం జగన్ తన మూడు రాజధానుల విధానానికి అమరావతిలోనూ విజయవంతంగా మద్దతు సంపాదించినట్లు అర్ధమవుతోంది. అదే సమయంలో పోటీ ఉద్యమంతో అసలు అమరావతి ఉద్యమం కళ తప్పడం కూడా ప్రభుత్వానికి పెద్ద ఊరటగానే కనిపిస్తోంది.