లాక్ డౌన్లోనూ అమరావతిలో సీఆర్డీయే హంగామా- మండిపడుతున్న రైతులు.
ఏపీలో కరోనా వైరస్ కేసులు ఇప్పటికే 329కి చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినా అమరావతిలో మాత్రం అధికారులు యథాతథంగా తమ పని చేసుకుపోతున్నారు. పేదలకు ఇళ్ల పంపిణీ కోసం భూముల వెతుకులాటతో పాటు స్దానికంగా విచారణలు కొనసాగిస్తున్నారు. దీనిపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలుచోట్ల రైతుల నిరసనలతో అధికారులు వెనుదిరుగుతున్నారు.
రాష్ట్రమంతా అలా. అమరావతిలో ఇలా..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం కేంద్రం సూచనల మేరకు లాక్ డౌన్ కొనసాగిస్తోంది. అత్యవసర విభాగాలు మినహా మిగతా ప్రభుత్వ శాఖలన్నీ తమ పనులను ఆపేశాయి. కానీ రాజధాని అమరావతిలో మాత్రం సీఆర్డీయే అధికారులు లాక్ డౌన్ ను ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.
రైతుల ఆగ్రహం- నిరనసలు..
అమరావతిలో పేదల ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం సేకరించిన భూములపై హైకోర్టు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో స్ధానికంగా ప్రత్యామ్నాయ భూములపై సీఆర్డీయే అన్వేషణ సాగిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు రైతుల వద్దకు వెళ్లి భూముల వివరాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పటికే అమరావతి విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న రైతులు వీరిని అడ్డుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఈ సమయంలో విచారణలు ఎలా నిర్వహిస్తారని వారిని ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారులు వెనుదిరగాల్సిన పరిస్ధితి.
హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా...
అమరావతిలో పేదల ఇళ్ల స్ధలాల కోసం భూసేకరణ విషయంలో ఈ నెల 20 వరకూ స్టే ఇచ్చిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకూ గడువునిచ్చింది. అయితే ఆ లోపే ప్రభుత్వం తమ భూముల వివరాలు తీసుకునేందుకు రావడం సరికాదని రైతులు చెబుతున్నారు. హైకోర్టు స్టే ఇచ్చినా, కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ హడావిడి విచారణలు ఏంటని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఇళ్ల స్ధలాలపై ప్రభుత్వం దృష్టి..
అమరావతిలో ఇళ్ల స్ధలాల కోసం ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. అయితే పంపిణీకి ముందే వీటిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు కూడా వేసింది. ఆ తర్వాత భూముల పంపిణీ మార్గదర్శకాలను మార్చిన ప్రభుత్వం, తాజాగా ప్రత్యామ్నాయాలపైనా దృష్టిసారిస్తోంది. దీనిపై రైతుల నుంచి ఆగ్రహం వ్యకమవుతోంది. నీరుకొండ, కురగల్లు గ్రామాల్లో విచారణకు వెళ్ళిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం దీనిపై ఎలా ముందడుగు వేస్తుందో చూడాల్సి ఉంది.
Recommended Video