అమరావతిపై ఏపీ హైకోర్టులో మరో పిటీషన్..
అమరావతి: అమరావతిపై ఏపీ హైకోర్టులో తాజాగా మరో పిటీషన్ దాఖలైంది. అమరావతి ప్రాంత రైతులు ఈ పిటీషన్ దాఖలు చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ పిటీషన్ వేశారు రైతులు. అమరావతి పరిధిలో ఆర్5 జోన్పై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేశారు. ఈ పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించిందని తెలుస్తోంది.
అమరావతి ప్రాంతంలో కొత్తగా ఆర్ 5 జోన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీన్ని నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ను సైతం జారీ చేసింది ప్రభుత్వం. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని జోన్ ఏర్పాటు చేసినట్లు ఇందులో పొందుపరిచింది. ఆర్-5 జోన్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి గల ముఖ్య ఉద్దేశం- పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టడమేనని చెబుతున్నారు. అందరికీ ఇళ్లు పథకం కింద అందుబాటులో ఉండే ధరలతో వాటి నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్ 5 పేరుతో జోన్ ఏర్పాటు చేసింది.

అందరికీ ఇళ్లు పథకం కింద అన్ని జిల్లాల్లో పేదలకు ప్రభుత్వం పట్టాలను మంజూరుచేసిన విషయం తెలిసిందే. ఆయా కాలనీల్లో ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అదే సమయంలో అమరావతిలో కూడా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం గతంలో గెజిట్ నోటిఫికేసన్ విడుదల చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం నోటిఫై చేసింది.
దీనికోసం అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో కూడా మార్పులు చేర్పులు చేసింది. గుంటూరు, విజయవాడకు చెందిన 28 వేల మందికి ప్రస్తుతం ఆర్-5 జోన్ పరిధిలోకి తీసుకువచ్చింది. వారికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. దీనిపై రాజధాని రైతులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకోవాలంటూ పిటీషన్ వేశారు.
నివాస స్థలాలుగా మార్చడానికి వీలుగా ప్రభుత్వం దీన్ని ఆర్-5 జోన్గా గుర్తిస్తూ ఇటీవలే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సర్వీస్ అపార్ట్మెంట్స్, పారిశ్రామిక అవసరాలు, వ్యాపార, వాణిజ్యపరమైన అనుమతులు ఈ జోన్ పరిధిలో వర్తించవు. ఇళ్ళ స్థలాల కోసం దీన్ని మార్పు చేసింది. దీనిపై స్థానిక రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో గ్రామ సభల్లో ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.
ఇప్పుడు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో సవరణ చేయటం, తాజాగా ఆర్5 జోన్ను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేయటం అమరావతి ప్రాంత రైతులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా వారు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని రద్దు చేయాలని వారు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications