ఏపీ రాజధానిగా అమరావతే - తేల్చేసిన సర్వే ఆఫ్ ఇండియా- తాజా పొలిటికల్ మ్యాప్లో కలకలం..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఓవైపు ప్రయత్నాలు సాగుతుండగానే అమరావతి రాజధానిపై సర్వే ఆఫ్ ఇండియా తీసుకున్న ఓ నిర్ణయం కలకలం రేపుతోంది. ఏపీలో అమరావతితో పాటు విశాఖ, కర్నూలును కూడా మూడు రాజధానులుగా ఆమోదిస్తూ ప్రభుత్వం తాజాగా వికేంద్రీకరణ ప్రక్రియ చేపట్టింది. కోర్టుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఇంకా తుది నిర్ణయం జరగకముందే అమరావతిని రాజధానిగా చూపిస్తూ తమ తాజా రాజకీయ మ్యాప్లను సర్వే ఆఫ్ ఇండియా మార్చడం చర్చనీయాంశమవుతోంది

గల్లా జయదేవ్ ప్రశ్నకు...
గతేడాది నవంబర్ 21న లోక్సభ జీరో అవర్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమరావతిపై కేంద్రాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాక తర్వాత మారిన పరిణామాల్లో రాజధానిగా అమరావతి ఉంటుందో లేదో స్పష్టత ఇవ్వాలని కేంద్రంతో పాటు సర్వే ఆఫ్ ఇండియాను గల్లా జయదేవ్ ప్రశ్నించారు. రాతపూర్వకంగా గల్లా జయదేవ్ అడిగిన సమాధానానికి సర్వే ఆఫ్ ఇండియా తాజాగా సమాధానం ఇచ్చింది. ఇది ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న కీలక నేపథ్యంలో సర్వే ఆఫ్ ఇండియా సమాధానం కలకలం రేపింది.

తాజా మ్యాప్ల్లో రాజధానిగా అమరావతి...
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సర్వే ఆఫ్ ఇండియా పంపిన సమాధానంలో తాము ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ తమ తాజా రాజకీయ మ్యాపుల్లో చేర్చినట్లు తెలిపింది. 2019లో రూపొందించిన ఇంగ్లీష్ ఎడిషన్తో పాటు 2020లో రూపొందించిన హిందీ ఎడిషన్ మ్యాపుల్లోనూ అమరావతిని రాజధానిగా చేర్చినట్లు సర్వే ఆఫ్ ఇండియా సమాధానం ఇచ్చింది. దీంతో టీడీపీతో పాటు అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక సంస్ధ తమ మ్యాప్ల్లో అమరావతిని చేర్చడం మంచి నిర్ణయం అంటున్నారు.

జగన్ సర్కారుకు షాక్...
ఓవైపు మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సర్వే ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అయితే గతంలో మ్యాప్ల్లో ఏపీ రాజధాని లేకపోవడంతో కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మార్పు చేశారని, దీనికి మూడు రాజధానులతో సంబంధం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి కీలక సమయంలో సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాధానమే సమస్యకు కారణమవుతోంది. ప్రభుత్వం తాజాగా మూడు రాజధానులకు అడ్డంకులు అధిగమించగలిగితే మ్యాప్ల్లో రాజధానుల మార్పుకు ఎంతో సమయం పట్టకపోవచ్చనేది ప్రభుత్వ వర్గాల భావన..












Click it and Unblock the Notifications