అమరావతి రైతుల మరో పాదయాత్ర - విశాఖ మీదుగా : అటు ప్రభుత్వం..!!
అమరావతి రైతులు మరో సారి పాదయాత్రకు సిద్దమయ్యారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. మూడు రాజధానుల ప్రకటన సమయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్న అమరావతి రైతుల ఉద్యమం వెయ్యి రోజులకు చేరుతోంది. సెప్టెంబర్ 12వ తేదీకి ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి కానుంది. అదే రోజు అమరావతి కేంద్రంగా సభకు జేఏసీ నేతలు ప్రణాఖిలు సిద్దం చేసారు. అన్ని పార్టీల నేతలను ఇందులో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండో విడత .. 60 రోజుల పాటు
ఇప్పటికే న్యాయాలయం టు దేవాలయం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసారు. ఇప్పుడు తుళ్లూరు మండలం వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఐకాస నాయకులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు యాత్ర సాగుతోందని వెల్లడించారు. 60 రోజులపాటు సాగే పాదయాత్రలో ప్రతి 8 రోజులకోసారి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. హైకోర్టులో కేసు విచారణ ఉన్న సమయంలో ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానులకు సంబంధించి బిల్లును ఉప సంహరించుకుంది. హైకోర్టు అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల అమలుకు సమయం కోరుతూ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది.
హైకోర్టు తీర్పు పై ప్రభుత్వం ఇంకా
తాజాగా.. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన రివ్యూ కోరాలా..లేక సుప్రీంలో ఎసెఎల్పీ వేయాలా అనే అంశం పైన ఆలోచన చేస్తుందని వెల్లడించారు. ఇక, ప్రభుత్వంలోని ముఖ్యులు మాత్రం మూడు రాజధానుల పైన కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. దీంతో..అమరావతి రైతులు తమకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా.. తొలి విడత పాద యాత్రలో వచ్చిన మద్దతుతో..ఇప్పుడు విశాఖ మీదుగా యాత్రకు ప్లాన్ చేసారు. గుంటూరు, కృష్ణా, ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు యాత్ర సాగనుంది. యాత్రను విజయవంతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతుతో
ఈ సందర్భంగా పాదయాత్ర అనుమతి కోసం ఐకాస నేతలు ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. యాత్ర సమయంలో ఇబ్బందులు కలగకుండా అంబులెన్స్, బయోటాయ్లెట్ల వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు రాజధాని వ్యవహారం రాజకీయంగానూ కీలక దశకు చేరుకుంది. వైసీపీ మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో..సెప్టెంబర్ 12న సభ పైన జేఏసీ నేతలు ఇప్పటికే పార్టీల నేతలతో సంప్రదింపులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం వైఖరి మూడు రాజధానులే అని చెబుతున్నా..న్యాయ పరంగా ఇచ్చిన తీర్పు విషయంలో ఏం చేయబోతుందనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.