రహదారిపైనే బైఠాయింపు..వంటా వార్పూ: మంత్రుల వ్యాఖ్యలతో మహిళల కన్నీరు: అమరావతిలో ఆందోళన..!
అమరావతిలో రైతులు..స్థానికులు ఆందోళన కొనసాగుతోంది. రైతులు రోడ్లపైనే బైఠాయించారు. అక్కడే వంటా వార్పూ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేశారు. రైతుల ఆందోళనలతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. అటు వెలగపూడిలో రాజధాని రైతుల రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శనకు దిగారు. తమ త్యాగాలను అవమానించొద్దంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో మంత్రులు తమ సామాజిక వర్గం..తాము టీడీపీ మద్దతు దారులమని..భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల మీద స్థానిక మహిళలు కన్నీరు పెట్టుకుంటూ..ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీక్షలు..నిరసనలు..రాస్తారోకోలు
ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో మూడు రాజధానుల వ్యాఖ్యలతో మొదలైన అమరావతి ప్రాంత రైతులు..స్థానికుల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. రాజధాని పరిధిలోని గ్రామాల ప్రజలు..రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. మందడం వద్ద రోడ్డు మీదే స్థానికులు వంటా వార్పూ చేస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
తమకు మూడు రాజధానులు వద్దు అని.. తమకు అమరావతి మద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చామని..తమ త్యాగాలను అవమానించవద్దంటూ నినాదాలు కొనసాగిస్తున్నారు. దీంతో..మండదం మీదుగా సచివాలయం కు వెళ్లే దారులను దిగ్బంధనం చేసారు. దీంతో..సచివాలయానికి వెళ్లే ఉద్యోగులను పోలీసులు ఇతర దారుల ద్వారా పంపుతున్నారు.
మంత్రుల వ్యాఖ్యలపైన ఆవేదన
మంత్రులు అమరావతిలో జరుగుతున్న నిరసనలపైన చేస్తున్న వ్యాఖ్యల మీద స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చామని..తాము ఒక పార్టీకి చెందిన వారిమని మంత్రులు వ్యాఖ్యానించటం పైన స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ సామాజిక వర్గం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారని..కావాలంటే ఇక్కడ ఉన్న తమ వర్గం వారిని ఎస్సీలుగా మార్చేయండంటూ రోదిస్తూ వ్యాఖ్యానిస్తున్నారు.
తాము ఒక పార్టీ కోసం చేయటం లేదని..తాము భూములను నమ్ముకొని జీవించామని..ఇప్పుడు తమ భవిష్యత్ ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పుడు భూములు వెనక్కు ఇచ్చేస్తామని మంత్రులు చెప్పటాన్ని వారు తప్పుబడుతున్నారు. ఇప్పుడు ఈ భూములు తీసుకొని ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు.
మానసిక క్షోభకు గురి చేస్తున్నారు..
తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యల పైన రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు వెనక్కి ఇస్తామన్న విషయం వైసీపీ మేనిఫెస్టోలో లేదన్నారు. సీఎం ప్రకటనతో ఇప్పటికే సగం చచ్చిపోయామని.. మంత్రుల వ్యాఖ్యలతో తీవ్ర క్షోభకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో రాజకీయాలు చేయొద్దన్నారు.
అమరావతిలో ఏ పార్టీ జెండా లేదు.. ఉన్నవి నల్ల జెండాలేనని రాజధాని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం రాజధాని విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న స్థానికులు..తమకు అన్యాయం చేస్తే..తమ పోరాటం ఎంతవరకైనా తీసుకెళ్తామని స్పష్టం చేస్తున్నారు.